Thai Businessman Is Selling His Million Dollar Ice Cream Company To Become A Monk
ప్రస్తుత సమాజంలో డబ్బు ప్రధానమనే భావన చాలా మందిలో ఉంది. ధనవంతులు ఇంకా డబ్బు సంపాదించి అందరి కంటే ముందుండాలని చూస్తారనే అభిప్రాయం ఉంది. ఆస్తులు పెంచుకుని విలాసవంత జీవితం గడపాలనుకునే కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి మాత్రం అలా కాదు. ఆస్తులు ఆయనకు ఆనందాన్ని ఇవ్వలేదు. డబ్బులో సంతోషం లేదని.. ఆధ్యాత్మిక మార్గమే సంతోషమయ జీవనానికి మార్గమని ఆచరిస్తున్నారు ఓ బిలియనీర్. ఇంతకూ ఆయన నిర్ణయం వెనక కారణం ఏంటో స్టోరీలో చూద్దాం.
థాయ్లాండ్కు చెందిన సిరిపాంగ్ అకర్శ్రీయాక్ 1999లో ఓ ఐస్క్రీమ్ బ్రాండ్ను ప్రారంభించారు. ఒకప్పుడు మార్కెట్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ కంపెనీ, కాలం మారుతున్న కొద్దీ పెరిగిపోయిన పోటీ కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే గత 15 ఏళ్లుగా సిరిపాంగ్ లౌకిక జీవితానికి దూరంగా ఉంటూ, ఒక పూర్తి స్థాయి బౌద్ధ భిక్షువుగా మారిపోవాలని మనసులో గట్టిగా కోరుకుంటున్నారు.
కొనుగోలుదారును పరిచయం చేస్తే రూ 1.4 కోట్ల రివార్డు ప్రకటన
పూర్తిగా సన్యాసం పుచ్చుకోవడానికి తనకు ఇంకో రెండేళ్ల సమయం ఉందని, ఆ లోపు ఒక మంచి ఆశ్రమాన్ని కట్టించి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ గడపాలని ఆయన అనుకుంటున్నారు. తన కంపెనీని కొనుగోలు చేసేందుకు సరైన వ్యక్తిని తీసుకువచ్చి పరిచయం చేసిన వారికి, ఏకంగా రూ.1.4 కోట్ల భారీ మొత్తాన్ని కమీషన్గా ఇస్తానని ఆయన ప్రకటించారు.
ఇప్పటికే బౌద్ధమతంపై పలు పుస్తకాలు రాసిన సిరిపాంగ్.. బుద్ధుడి గొప్ప బోధనలపై తరచూ ప్రసంగాలు చేస్తూ అందరినీ ఆలోచింపజేస్తుంటారు. లౌకిక వ్యాపారాలన్నీ వదిలేసి జ్ఞానోదయం పొందడమే తన జీవితానికి అసలైన అర్థమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కోట్ల విలువైన వ్యాపారాన్ని, సిరిసంపదలను వదిలేసి ఇలా ఆధ్యాత్మిక బాట పట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!