ఏపీలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల పంటకు బీమా సౌకర్యం అందించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో నమోదు చేసుకునేందుకు రైతులకు ఇచ్చిన గడువును కేంద్రం తాజాగా పొడిగించింది. ఆగస్ట్ 15 వరకు గడువు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం రాష్ట్రంలోని రైతులందరికీ వర్తిస్తుంది. బ్యాంకులు రుణాలు తీసుకున్నవారితో పాటు తీసుకోనివారికి కూడా వర్తిస్తుంది. బీమా పథకంలో రైతులు చేరేందుకు గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సూచనలో కేంద్రం మరో 15 రోజుల పాటు సమయం ఇచ్చింది. అర్హులైన రైతులు చేరాలని ప్రభుత్వం సూచించింది.
రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజనతో పాటు వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. వీటి ప్రీమియం చెల్లింపు గడువును పెంచాలని కోరగా.. బీమా సంస్థలు ఫసల్ బీమా యోజన గడువును మాత్రమే పెంచాయి. కేంద్రం వ్యవసాయశాఖ మంత్రి బీమా సంస్థలతో చర్చలు జరిపారు. అనంతరం బీమా సంస్థలు ప్రీమియం చెల్లించేందుకు మరింత గడువు ఇచ్చాయి. దీంతో రైతులు త్వరగా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖ కోరుతోంది. ప్రధానమంత్రి ఫసల్ బీయా యోజన పథకంలో చేరేందుకు జులై 31 వరకు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో చివరిరోజు గ్రామ, వార్డు సచివాయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, డిజిటల్ సేవా కేంద్రాలకు రైతులు క్యూ కట్టారు. కానీ సర్వర్లు మొరాయించడంతో ఇబ్బందులు పడ్డారు.
ఇక వాతావరణ ఆధారిత బీమా పథకం గడువు కూడా జులై 31తో ముగిసింది. జులై 15 వరకు అవకాశం ఇవ్వగా.. అనంతరం జులై 31 వరకు పొడిగించారు. ఈ పథకం 7 పంటలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దరఖాస్తు గడువను ఆగస్ట్ 15 వరకు పొడిగించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు గడువులోగా ఈ స్కీమ్లో చేరాలని, తర్వాత అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. కాగా ఈ పథకంలో చేరితే పంటకు బీమా సౌకర్యం లభిస్తుంది. ఇందుకు రైతులు కొంత ప్రీమియం చెల్లిస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత ప్రీమియం చెల్లిస్తాయి. వరదలు, వర్షాలు, భూకంపాలతో పాటు ఇతర ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంటకు నష్టం జరిగినప్పుడు రైతులకు బీమా సొమ్ము అందుతుంది.