
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, బంకుల్లో పెట్రోల్ నిల్వలు సరిపోయేంతగా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని, అందుకే పెట్రోల్ బంక్లు మూసివేశారనే వార్తలపై స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇంధన సరఫరాలో లోపాలు, సమస్య కారణంగానే కొన్ని ప్రాంతాల్లో బంక్లు మూతపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇంధనానికి మాత్రం ఎలాంటి కొరత లేదని, వాహనదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ స్టాక్కు సంబంధించి తాము ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని, సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై చర్యలు
అయితే వ్యాపారులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలపై నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంధన సరఫరా చైన్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు అవుట్ లెట్లను తనిఖీలు చేయాలని, ప్రైవేట్ అవుట్ లెట్, చమురు కంపెనీల డిపోలను చెక్ చేయాలని సూచించారు. పెట్రోల్ బంకుల వద్ద గొడవలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులతో సమన్వయం చేసుకుని అధికారులు పనిచేయాలని సూచించారు. అయితే పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల క్రమంలో వాహనదారులు బంక్ల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో బంకుల వద్ద రద్దీ పెరిగింది.
నిఘా పెంచాం..
ఇక పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా అధికారులు నిఘా పెట్టాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అలా బ్లాక్ మార్కెట్కు తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే కొన్నిచోట్ల ఇంధనాన్ని డ్రమ్ముల్లో నింపుకుంటున్నారు. దీంతో పెట్రోల్ బంక్ల నిర్వాహకులు పరిమితంగా అమ్మకాలు జరుపుతున్నారు. డ్రమ్ములు పట్టుకుని వచ్చేవారికి నిర్వాహకులు ఇవ్వడం లేదు.