పొట్ట కూటికోసం ఊరుకాని ఊరు వచ్చిన ఓ వ్యక్తి.. తన యజమాని పల్సర్ బైక్ తీసుకెళ్లి తప్పించుకునే ప్రయత్నంలో విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు సమీపంలోని చెయ్యేరు వంతెన పై నుంచి దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కడప రాజారెడ్డి వీధికి చెందిన నూరుల్లా (45) గా గుర్తించారు. మృతుడు ఆరు నెలల క్రితం సిద్ధవటంలోని ఓ హోటల్లో పనిచేస్తూ ఓనర్ కృష్ణారెడ్డి పల్సర్ బైక్ తీసుకొని పరారీ అయ్యాడు. గత రెండురోజుల క్రితం కడపలోని ఓ దుకాణంలో పనిచేస్తూ మృతుడు ఓనర్ కృష్ణారెడ్డికి దొరికాడు. దొంగిలించిన బండి తిరుపతిలో ఉందని చెప్పడంతో కృష్ణారెడ్డి తన వాహనంలో తిరుపతికి నూరుళ్లను తీసుకువెళ్ళాడు.
ఈ క్రమంలోనే.. తిరుపతికి వెళ్లి బైక్ లేకపోవడంతో తిరిగి వస్తుండగా నూరుల్లా వారు ప్రయాణిస్తున్న వాహనం డోర్ తీసుకొని చెయ్యరు వంతెనపై నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వంతెన పై నుంచి దూకాడు.. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన కృష్ణారెడ్డి.. తీవ్ర గాయాలతో ఉన్న నూరుల్లాను రాజం పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే.. మార్గ మధ్యలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మన్నూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..