ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు సంప్రదాయ వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎండలు, తీవ్ర వర్షాలు లేదా కరువు వల్ల పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా చైనా శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. భూమి ఉపరితలంపై కాకుండా, మూసివేసిన బొగ్గు గనుల భూగర్భ సొరంగాల్లో పంటలు పండించే అండర్గ్రౌండ్ ఫార్మింగ్ పద్ధతిని ప్రతిపాదించారు.
1. మూసివేసిన బొగ్గు గనుల వినియోగం:
చైనాలోని షాంగ్సీ ప్రాంత శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ప్రణాళిక ప్రకారం, 2030 నాటికి చైనాలో సుమారు 15,000 మూసివేసిన బొగ్గు గనులు అందుబాటులోకి రానున్నాయి. ఈ గనుల్లో ఇప్పటికే పవర్ సప్లై, వెెంటిలేషన్ మరియు విశాలమైన సొరంగాలు ఉంటాయి. వీటిని ఉపయోగించుకుని భూగర్భంలోనే నియంత్రిత వాతావరణంలో వ్యవసాయం చేయవచ్చు.
2. సూర్యరశ్మికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ వెలుతురు:
భూమికి వందల మీటర్ల లోతున వెలుతురు ఉండదు కాబట్టి, మొక్కల కిరణజన్య సంయోగక్రియ కోసం ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ లైటింగ్ అమరుస్తారు. దీనివల్ల బయట రాత్రి ఉన్నా, వర్షం పడుతున్నా లోపలి పంటలకు కావాల్సినంత కాంతి నిరంతరం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
3. భూగర్భ వేడి, నీటి పునర్వినియోగం:
భూమి లోపల ఉష్ణోగ్రతలు ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంటాయి. ఈ వాతావరణాన్ని క్రమబద్ధీకరించడానికి భూగర్భంలో ఉండే జియోథర్మల్ ఎనర్జీ ని ఉపయోగిస్తారు. అలాగే, గనుల్లో ఉండే రసాయనాలతో కూడిన నీటిని మెంబ్రేన్ సెపరేషన్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో శుద్ధి చేసి టీ, ఆవాలు వంటి పంటల నీటిపారుదలకు ఉపయోగిస్తారు.
4. అంతరిక్ష పరిశోధనలకు ల్యాబ్గా..
ఈ ప్రాజెక్ట్ కేవలం ఆహార కొరతను తీర్చడానికే కాకుండా, ఒక హైటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ల్యాబ్గా పనిచేస్తుంది. సహజ సిద్ధమైన వాతావరణం లేని చోట మొక్కలను ఎలా పెంచాలో ఇక్కడ పరిశోధిస్తారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో అంతరిక్ష కాలనీలు, చందమామ, అంగారక గ్రహాలపై మానవ నివాస ప్రాంతాల్లో వ్యవసాయం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..