తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య పలు కీలక అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 22ఏ నిషేధిత భూముల వ్యవహారం సభలో ప్రధాన చర్చనీయాంశంగా మారనుంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం కూడా సమగ్ర వివరాలతో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైంది.
ప్రశ్నోత్తరాల అనంతరం పలు నివేదికలను సభ ముందుకు తీసుకురానున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష 2024-25 ఆడిట్ నివేదిక, పీఎం శ్రీ తెలంగాణ 2024-25 ఆడిట్ నివేదికతో పాటు మెట్రోకు సంబంధించిన వార్షిక నివేదికలు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించిన పలు CAG నివేదికలు ఇంకా శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉన్నట్లు అధికారిక రికార్డులు కూడా చూపిస్తున్నాయి.
లైవ్ కోసం వీడియో చూడండి
22ఏ భూముల విషయంలో భూయజమానుల ఆందోళనలు, నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రైతుల సమస్యలు, సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్, సాగునీరు, ఉద్యోగులు-పెన్షనర్ల సమస్యలు వంటి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సమావేశాలు రాజకీయంగా హాట్హాట్గా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.