ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు గుణశేఖర్. అలాగే గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు నంది పురస్కారాలను అందుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ఒక్కడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఒక్కడు సినిమా 8 నంది అవార్డులనూ, ఉత్తమ దర్శకుడి పురస్కారంతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. అలాగే 2015 లో విడుదలైన చారిత్రాత్మక సినిమా రుద్రమదేవి సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు పొంది చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది. యుఫోరియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గుణశేఖర్ . కాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రుద్రమదేవి సినిమా గురించి ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అల్లు అర్జున్ అందించిన సహకారం గురించి గుణశేఖర్ మాట్లాడుతూ, ఆయన డబ్బును పక్కనపెట్టి, కేవలం చరిత్రపై, తనపై ఉన్న గౌరవంతో గోన గన్నారెడ్డి పాత్రను పోషించారని వెల్లడించారు. ఆ సమయంలో అల్లు అర్జున్ రేసుగుర్రం విజయంతో మంచి ఫామ్లో ఉన్నారని, ఆయన “నేను చేస్తాను” అని ముందుకు రావడమే ఎంతో గొప్ప విషయమని, అది ఎన్ని కోట్లతోనూ కొలవలేనిదని గుణశేఖర్ అన్నారు. అల్లు అర్జున్కు సంస్కృతి, సంప్రదాయాలపై ఎంతో గౌరవం ఉందని, ఆయన పెంపకం ఎంతో గొప్పదని, తన కుమార్తె అల్లు అర్హ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారని, ఇది ఈ రోజుల్లో ఎక్కడా వినలేదని తెలిపారు. అల్లు అర్జున్ షూటింగ్కు ఎప్పుడూ సమయానికి ముందే వస్తారని, ఈ క్రమశిక్షణ ఆయనకు మొదటి నుంచీ ఉందని గుణశేఖర్ ప్రశంసించారు.
భూమిక చావలా తనను ఒక గురువులా, మార్గదర్శకుడిలా భావిస్తారని, ఆమె ఎంతో మర్యాదస్తురాలని గుణశేఖర్ పేర్కొన్నారు. నన్నే కాదు, ఆమె అందరు దర్శకులతోనూ అంతే మర్యాదగా ఉంటారని, ఆమె ప్రవర్తన చూస్తే ఎవరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుందని వివరించారు. రానా దగ్గుబాటితో గతంలో ఒక ప్రాజెక్టు విషయంలో వచ్చిన చిన్న విభేదం కేవలం వృత్తిపరమైనదని, వ్యక్తిగతమైనది కాదని, ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుని పరిష్కరించుకున్నామని స్పష్టం చేశారు. తన కుటుంబం మూడేళ్లుగా కష్టపడి యుఫోరియా అనే కథ తెరకెక్కించమని గుణశేఖర్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.