తెలుగు భాషపై ఉన్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీష్. చేనేత మగ్గంపై నూలుతో ఎన్నో రకాల డిజైన్లను ఆవిష్కరించే ఆయన.. ఈసారి తెలుగు భాషలోని అక్షరాలనే చీరకు అందమైన డిజైన్లుగా మలిచారు. ఏకంగా 56 తెలుగు అక్షరమాలను పట్టు చీరపై కళాత్మకంగా డిజైన్ చేసి, తెలుగు భాషకు చేనేత కళ ద్వారా నీరాజనం పలికారు. సాధారణంగా పట్టు చీరలపై పూలు, ఆకులు, నెమళ్లు, సంప్రదాయ డిజైన్లు, వివిధ ఆకృతులు కనిపిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా తెలుగు అక్షరమాలనే ప్రధాన డిజైన్గా తీసుకుని జగదీష్ ఈ ప్రత్యేకమైన చీరను రూపొందించారు. అక్షరాలను అందంగా అమర్చడంతో పాటు చీర ఆకర్షణీయంగా కనిపించేలా కళాత్మకతను జోడించారు.