హైదరాబాద్ నగరంలో మరోసారి మైనర్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమైంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ కార్మిక్నగర్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వరుసగా పార్క్ చేసి ఉన్న ఏడు బైకులు ధ్వంసమయ్యాయి.17 ఏళ్ల అలీ అహ్మద్ ఖాన్ అద్దెకు తీసుకున్న బలెనో కారును నడుపుతున్న సమయంలో డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోయాడు. ముందుగా రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ను కారు ఢీకొట్టి, అనంతరం వేగంగా దూసుకెళ్లిన కారు రోడ్డుపక్కన నిలిపి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసింది.
ఈ ప్రమాదంలో సోదరులు రాజ్కుమార్ (60), ప్రభాకర్ (55) తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును మైనర్ నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే కారు అద్దెకు తీసుకున్న విధానం, డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించారా లేదా అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలను విచారిస్తున్నారు.
వీడియో చూడండి
మరోసారి మైనర్ డ్రైవింగ్పై ప్రశ్నలు
ఈ ఘటనతో నగరంలో మైనర్ డ్రైవింగ్పై మరోసారి చర్చ మొదలైంది. కఠినమైన మోటార్ వెహికల్ చట్టాలు, భారీ జరిమానాలు అమల్లో ఉన్నప్పటికీ మైనర్ల చేతికి కార్లు ఎలా చేరుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అద్దె కార్ల సంస్థలు డ్రైవింగ్ లైసెన్స్, వయస్సు వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలిస్తున్నాయా అనే అంశంపై అధికారులు దృష్టి సారించే అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.