
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహాన్ వ్యాపార ఒప్పందం పేరుతో తనను ఘోరంగా మోసగించాడని దిన్ కర్ విశ్వామిత్ర అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఒడిశాలోని జిందాల్ స్టీల్ కంపెనీతో తమ గోవింద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఐరన్ ఓర్ రవాణా కాంట్రాక్ట్ వచ్చిందని చౌహాన్ నమ్మబలికినట్లు బాధితుడు ఆరోపించాడు. పెద్ద పారిశ్రామికవేత్తలతో తనకు ఉన్న సంబంధాలను చూపి, వ్యాపారంలో భాగస్వామిగా చేరితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపినట్లు పేర్కొన్నాడు.
ఈ మాటలు నిజమని నమ్మిన విశ్వామిత్ర, జూలై 2021లో రాజేష్ చౌహాన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. తొలుత రూ. 2.51 లక్షలను చెక్కు రూపంలో, ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో కలిపి మొత్తం రూ. 15.01 లక్షలను చౌహాన్ కంపెనీ బ్యాంక్ ఖాతాలోకి విడతలవారీగా బదిలీ చేశాడు. అయితే, కాలక్రమేణా కాంట్రాక్ట్ ముందుకు సాగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు విచారించగా, అది నకిలీ కాంట్రాక్ట్ అని తేలింది.
కోర్టు కఠిన ఉత్తర్వులు: ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు..
మోసపోయానని గ్రహించిన విశ్వామిత్ర Mohan Nagar పోలీసులను, దుర్గ్ ఎస్పీని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో దుర్గ్ జిల్లా జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) నిబంధనల ప్రకారం మోసం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు Mohan Nagar పోలీసులు భారతీయ నవ్య సంహిత (BNS) సెక్షన్ 316(2) క్రిమినల్ నమ్మకద్రోహం కింద రాజేష్ చౌహాన్పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మోహన్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. పోలీసు అధికారులు సైతం రంగంలోకి దిగి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
క్రికెట్ ట్రాక్ రికార్డ్ నుంచి వ్యాపార వివాదాల వరకు..
బీహార్లో జన్మించిన రాజేష్ చౌహాన్, మధ్యప్రదేశ్ తరఫున సుదీర్ఘకాలం రంజీ ట్రోఫీలు ఆడాడు. 1993లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఆఫ్ స్పిన్నర్, 90ల కాలంలో అనిల్ కుంబ్లే, వెంకటపతి రాజులతో కలసి భారత స్పిన్ విభాగాన్ని నడిపించాడు. ఐదేళ్ల పాటు సాగిన తన అంతర్జాతీయ కెరీర్లో 21 టెస్టులు, 35 వన్డేలు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు. డొమెస్టిక్ క్రికెట్లో 400కి పైగా వికెట్లు సాధించిన రికార్డు అతని సొంతం.
2000-01 సీజన్ తర్వాత ఆట నుంచి తప్పుకున్న చౌహాన్, వ్యాపార రంగానికి మారాడు. అయితే, ఇప్పుడు వ్యాపారంలో నమ్మకద్రోహానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. చౌహాన్ మాత్రం దీనిని సాధారణ వ్యాపార వివాదంగా అభివర్ణిస్తూ, ఇప్పటికే కొంత డబ్బు తిరిగి ఇచ్చానని, మిగిలిన డబ్బు వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యమైందని క్లెయిమ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మైదానంలో వికెట్లతో అలరించిన ఒకనాటి అంతర్జాతీయ క్రికెటర్, ఇప్పుడు ఇటువంటి చీటింగ్ ఆరోపణల్లో చిక్కుకోవడం క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల విచారణలో నిజా నిజాలు తేలాల్సి ఉండగా, చట్టప్రకారం న్యాయస్థానం ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..