హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోండగా.. ఆగస్ట్ వరకు సమయం ఇచ్చింది. నియోజకవర్గం పరిధిలోని మీ సేవా కేంద్రాలు, మీ సేవా వాట్సప్ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అప్లికేషన్ ఫీజు రూ.100గా ఉండగా.. రూ.10 వేలు రీఫండబుల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో అప్డేట్ ఇచ్చింది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఫ్లాంట్ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అలాగే కార్పెట్ ఏరియా 400 చదరపు అడుగులు ఉండనుంది. ప్రభుత్వ భూముల్లోనే ఈ ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు అందించనున్నారు. పేదలు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్ల సమీపంలోనే వీటిని నిర్మించి అందించనున్నారు.
అయితే ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి రూ.11 లక్షల ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుండగా. మిగతా రూ.6 లక్షలు లబ్దిదారుడు భరించాల్సి ఉంటుంది. ఖైరతాబాద్, నాంపల్లి, అంబర్ పేట్, కూకట్ పల్లి. మేడ్చల్, సనత్ నగర్, సికింద్రాబాద్, మలక్ పేట్, రాజేంద్ర నగర్, మహేశ్వరం, శేరలింగంపల్లి, మల్కాజ్ గిరి, ఇబ్రహీంపట్నం వంటి ఏరియాల్లో ఉన్న నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించి ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో వివరాలు వెల్లడించారు.
“ప్రతీ కుటుంబం ఆత్మ గౌరవంతో బతకాలనేది మా లక్ష్యం. సొంత ఇల్లు ప్రతీ ఒక్కరి కల. పెరిగిన ధరలతో సొంత ఇల్లు కట్టుకోవడం పేదలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో పేదలకు ఇండ్లు కట్టించాలని నిర్ణయించాం. పథకం పురోగతిపై సమీక్ష నిర్వహించా. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఫ్లాట్లు నిర్మించనున్నాం. ఇంటి నిర్మాణానికి అయ్యే రూ. 11 లక్షల ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు సబ్సిడీగా అందిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారుని వాటా. తొలి దశలో 17 నియోజకవర్గాల పరిధిలో 7,680 ఫ్లాట్లు నిర్మించి ఇస్తాం. హైదరాబాద్ మహా నగరంలో గజం రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు పలుకుతోంది. గత ప్రభుత్వాలు నగరానికి దూరంగా ఇళ్లు నిర్మించడంతో ఎవరూ అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఆయా కుటుంబాలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మేం నిర్ణయించాం. ఈ క్రమంలో రూ.వందల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయిస్తోంది. జనావాసాల మధ్య నిర్మించే ఈ ఇళ్లల్లో పేదలకు విలువైన సొంత ఇల్లు అతి తక్కువ వ్యయంతో అభ్యమవడంతో పాటు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది” అని రేవంత్ ఎక్స్లో పేర్కొన్నారు.
ప్రతి కుటుంబం ఆత్మ గౌరవంతో బతకాలనేది మా లక్ష్యం. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. పెరిగిన ధరలతో సొంత ఇల్లు కట్టుకోవడం పేదలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో పేదలకు ఇండ్లు కట్టించాలని నిర్ణయించాం. పథకం పురోగతిపై ఈ రోజు సమీక్ష నిర్వ… pic.twitter.com/xoDYmg1AMb
— Revanth Reddy (@revanth_anumula) July 24, 2026