మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లా ఆసుపత్రికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. విషం సేవించిన ఓ యువకుడికి సాధారణ సెలైన్కు బదులుగా రెండు లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ నుంచి డ్రిప్ ఇస్తున్నట్లు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.1
18 ఏళ్ల సోను యాదవ్ ఎలుకల విషం సేవించడంతో అత్యవసర చికిత్స కోసం దిండోరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలో ఉన్న ఓ వ్యక్తి అక్కడి దృశ్యాలను 9 సెకన్ల వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో స్టాండ్కు వేలాడదీసిన మినరల్ వాటర్ బాటిల్ నుంచి ట్యూబ్ రోగి వైపు కనిపించడంతో, అతడికి నీటి బాటిల్తోనే డ్రిప్ ఇస్తున్నారని ప్రచారం మొదలైంది.
అయితే ఈ ఆరోపణలను దిండోరి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ పాండే ఖండించారు. రోగికి మినరల్ వాటర్ను డ్రిప్ రూపంలో ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎలుకల విషం సేవించిన తర్వాత గ్యాస్ట్రిక్ లావేజ్ (కడుపును శుభ్రపరిచే ప్రక్రియ) నిర్వహించామని, ఆ ప్రక్రియలో ఉపయోగించిన బాటిల్ మాత్రమే వీడియోలో కనిపించిందని వివరించారు. డ్రిప్కు బదులుగా వాటర్ బాటిల్ ఉపయోగించారన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.
అయితే గ్యాస్ట్రిక్ లావేజ్లో మినరల్ వాటర్ వినియోగం వైద్య మార్గదర్శకాలకు అనుగుణమేనా అనే అంశంపై విచారణకు ఆదేశించినట్లు సీఎంహెచ్ఓ తెలిపారు. సాధారణంగా ఈ ప్రక్రియలో గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియకుండా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ తెలిపింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..