IND vs ZIM 1st T20I: ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పుడు జింబాబ్వే సవాలుకు సిద్ధమైంది. గురువారం నుంచి భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా నాయకత్వ బాధ్యతలు వహిస్తున్న శ్రేయస్ అయ్యర్ మొదటి టీ20Iకి ముందు ఆటగాళ్లకు స్పష్టమైన సందేశాన్నిచ్చారు. జట్టులోని ఆటగాళ్లు ఓటమి గురించి భయపడకూడదని, మైదానంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడాలని అయ్యర్ స్పష్టం చేశారు.
వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్, ఆటగాళ్ల మైండ్సెట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “నా ఉద్దేశంలో ఆటగాళ్లు ఓటమికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మదిలో ఆ భయం ఉంటే, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రదర్శన ఇవ్వడం మొదలుపెడతారు. అంటే డిఫెన్సివ్గా మారిపోతారు. అదే భయాన్ని పక్కన పెడితే ఆటగాళ్లు తమ అత్యుత్తమ శ్రమను మైదానంలో చూపించగలరు” అని అయ్యర్ తెలిపారు. అలాగే బయట ప్రజలు లేదా విమర్శకులు ఏమనుకుంటున్నారనే దానికంటే వర్తమానంలో జీవించడం, ఒక జట్టుగా ఏకతాటిపైకి వచ్చి ఆడడమే ముఖ్యమని చెప్పారు.
గత పర్యటనల్లో ఫలితాలు టీమిండియాకు అనుకూలంగా రాలేదు. ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల T20 సిరీస్లో 0-2తో ఓడిపోవడంతో పాటు, ఇంగ్లాండ్పై ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-4తో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వైట్-బాల్ క్రికెట్లో వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్గా అయ్యర్పై ఒత్తిడి పెరిగింది. అయితే ఇంగ్లాండ్ పర్యటన కష్టంగా ఉన్నప్పటికీ, దాని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని, ప్రతికూల పరిస్థితుల్లో ఎలా మారాలి, ఎలాంటి వ్యూహాలతో ముందడుగు వేయాలో అర్థమైందని అయ్యర్ అభిప్రాయపడ్డారు.
శ్రేయస్ అయ్యర్కు జింబాబ్వే పర్యటన ఇదే తొలిసారి. అక్కడ మైదానాల్లో వాతావరణానికి త్వరగా అలవాటు పడడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రాక్టీస్ చేయడానికి తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలోనే అసలైన మజా ఉంటుందన్నారు. కష్టకాలం వచ్చినప్పుడే ఆటగాళ్లు మానసికంగా దృఢంగా మారతారని, జట్టుగా మరింత దగ్గరవుతారని అయ్యర్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సిరీస్లో ముగ్గురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. వారిలో ఒకరు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్నవారు కావడం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి