Harbhajan Singh : టీమిండియా యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ ఆఫ్స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్తో జరిగిన టి20 సిరీస్లో 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి అంతగా రాణించలేకపోయినప్పటికీ సూర్యవంశీలోని ప్రతిభపై జట్టు యాజమాన్యం, దిగ్గజాలకు పూర్తి నమ్మకం ఉంది. రాబోయే జింబాబ్వే సిరీస్లో కూడా అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్లో ఎలాంటి బౌలర్నైనా లెక్కచేయకుండా మైదానం నలుమూలలా షాట్లు కొట్టే అతని నైజం ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులను ఆకట్టుకుంది.
జియోస్టార్ చర్చా కార్యక్రమంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. నేటి తరం క్రికెటర్ల ఆలోచనా విధానం, అప్పటి కాలంతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని తెలిపాడు. “ఈనాటి యువతకు, నాటి యువతకు ఉన్న ప్రధాన తేడా సోషల్ మీడియా, మీడియా వ్యాప్తి. అప్పట్లో విమర్శలు ఉండేవి కానీ, ఇప్పుడు ప్రతీ చిన్న విషయం బాగా హైలైట్ అవుతోంది. వైభవ్ సూర్యవంశీ ఈ వయసులో చేస్తున్న విధ్వంసం గతంలో ఎవరూ చేయలేదు. అతడొక అద్భుతమైన టాలెంట్. నా క్రికెట్ కెరీర్లో ఇలాంటి టాలెంట్ను ఎప్పుడూ చూడలేదు, ఎదుర్కోలేదు” అని భజ్జీ కొనియాడాడు.
ఆధునిక క్రికెట్లో భయం లేకుండా తమ సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శించే క్రీడాకారులకు ఆదరణ పెరుగుతోందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. క్రీజ్లోకి వచ్చి డిఫెన్సివ్గా ఆడటం కంటే, మొదటి బంతి నుంచే ఎటాకింగ్ చేసే బ్యాటర్లను జట్లు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఈ మైండ్సెట్కు ఒక సరికొత్త ఉదాహరణ అని వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ అరంగేట్రానికి ముందు రాహుల్ ద్రవిడ్తో సూర్యవంశీ జరిపిన ఒక సంభాషణను భజ్జీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. “సూర్యవంశీ ఆడుతున్న జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్నారు. మొదటి బంతి పడితే ఏం చేస్తావ్? అని ద్రవిడ్ అతడిని అడిగారు. దానికి ఆ కుర్రాడు ‘మొదటి బంతి నా ఆర్క్లో పడితే సిక్స్ కొడతాను’ అని చెప్పాడు. చెప్పినట్లే ఐపీఎల్లో షార్దూల్ ఠాకూర్ వేసిన తన కెరీర్ మొదటి బంతినే సిక్సర్గా మలచి ఆశ్చర్యపరిచాడు” అని హర్భజన్ సంతోషం వ్యక్తం చేశాడు. రాబోయే కాలంలో భారత జట్టుకు సూర్యవంశీ కీలక ఆటగాడిగా మారతాడని దీమా వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి