
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక అడుగు ముందుకేసి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన నియోజకవర్గమైన నర్సీపట్నం నుంచి టెన్త్ క్లాస్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయన తన సొంత నివాసంలోనే విందు ఇచ్చారు.
నర్సీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా 580 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులను స్పీకర్ తన ఇంటికి ఆహ్వానించారు. కేవలం అభినందనలకే పరిమితం కాకుండా, ఆ విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ హోదాలో ఉండి కూడా, సామాన్య విద్యార్థులతో కలిసి భోజనం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన అయ్యన్నపాత్రుడు, వారి భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల విజయాన్ని గుర్తిస్తూ వారిని శాలువాలతో సత్కరించారు. అంతేకాకుండా, మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక కళాకారులు తయారు చేసిన సరస్వతీ దేవి విగ్రహాలను జ్ఞాపికలుగా అందజేశారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని కొనియాడుతూ, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తల్లిదండ్రుల ఆకాంక్షలు, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ వల్లే విద్యార్థులు ఈ స్థాయికి చేరుకున్నారు అని అయ్యన్నపాత్రుడు ప్రశంసించారు. రాష్ట్ర స్పీకర్ తమను పిలిచి గౌరవించడం, వారితో ఫోటోలు దిగడం విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమం కేవలం ఆ 11 మందికే కాకుండా, మిగిలిన విద్యార్థులకు కూడా స్ఫూర్తినిచ్చేలా సాగింది. ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై సమాజంలో నమ్మకం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..