పశ్చిమ బెంగాల్ ఎన్నికల రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతూ, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రెండు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం రీ-పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ అవకతవకలు, రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 2, 2026 (శనివారం) ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 29న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని బూత్లలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు సుబ్రతా గుప్తా ఇచ్చిన నివేదిక ఆధారంగా కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతోంది. మగ్రాహత్ వెస్ట్ నియోజకవర్గం పరిధలో అత్యధికంగా 11 బూత్లలో పోలింగ్ ప్రారంభమైంది. బూత్ నంబర్లు: 46, 126, 127, 128, 142, 214, 215, 216, 230, 231, 232 పోలింగ్ నిర్వహిస్తున్నారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూత్లలో పోలింగ్ మొదలైంది. బూత్ నంబర్లు 117, 179, 194, 243 ఓటింగ్ జరుగుతోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 58(2) ప్రకారం పాత ఓటింగ్ను రద్దు చేసి, తాజాగా పోలింగ్ నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.
మరోవైపు, ఫల్తా నియోజకవర్గంలో ఈవీఎంలకు డక్ట్ టేప్ అంటించారనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై కమిషన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సంబంధిత రిటర్నింగ్ అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత, ఫల్తాలో కూడా రీ-పోలింగ్ అవసరమా లేదా అనే విషయంపై శనివారం సాయంత్రం లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.
ఈ రీ-పోలింగ్ నిర్ణయం అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. “తమ ఓటమి ఖాయమని తెలిసే బీజేపీ కుట్రపూరితంగా రీ-పోలింగ్కు డిమాండ్ చేస్తోంది. ప్రజలను మళ్లీ క్యూలైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతున్నారు. తీర్పు ఎప్పుడూ టీఎంసీ వైపే ఉంటుంది.” అని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. దీనికి భిన్నంగా బీజేపీ నేత శుభేందు అధికారి స్పందిస్తూ, “డైమండ్ హార్బర్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ శ్రేణులు భారీగా రిగ్గింగ్కు పాల్పడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం,” అని పేర్కొన్నారు. ఇదిలావుంటే, డైమండ్ హార్బర్ నియోజకవర్గం టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీకి బలమైన కోట కావడంతో, ఇక్కడ జరుగుతున్న రీ-పోలింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాయంత్రం 6 గంటల వరకు ఈ ఓటింగ్ కొనసాగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..