ముంబై నగర వేగవంతమైన జీవనశైలిలో, మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెప్పే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. దివ్య ఉన్ని అనే ఇన్స్టాగ్రామ్ వినియోగదారు పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భయంకరంగా ముగియాల్సిన ఒక అజాగ్రత్త, ఒక డెలివరీ ఏజెంట్ పుణ్యమా అని అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.
దివ్య అనే యువతి ఒకరోజు అత్యవసర పనిమీద బయటకు వెళ్తూ, పొరపాటున తన ఇంటి ప్రధాన ద్వారాన్ని పూర్తిగా తెరిచి ఉంచేసింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ ఇంటి వద్దకు ఒక పార్శిల్ను డెలివరీ చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. తలుపు తెరిచి ఉండటం చూసి అతను ఆందోళన చెందాడు. సాధారణంగా ఎవరైనా అయితే పార్శిల్ అక్కడ పడేసి తమ పని చూసుకుంటారు, కానీ అతను అలా చేయలేదు.
వెంటనే దివ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె వచ్చే వరకు పార్శిల్ను లోపల భద్రంగా ఉంచుతానని, ఇంటికి కాపలా ఉంటానని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగానే, ఆమె తిరిగి వచ్చే వరకు ఆ డెలివరీ ఏజెంట్ అక్కడే నిలబడి ఇంటిని గమనిస్తూ ఉన్నాడు.
దివ్య ఇంటికి చేరుకున్నప్పుడు, తలుపులు తెరిచి ఉండటం చూసి షాక్ అయ్యింది. కానీ అక్కడ కాపలాగా నిలబడిన ఆ వ్యక్తిని చూసి ఆమె మనసు నిండిపోయింది. ఆమె తన ఫోన్ కెమెరాను అతని వైపు తిప్పగా, అతను చిరునవ్వుతో తన పేరు అమ్జద్ అని పరిచయం చేసుకున్నాడు. ఒక అపరిచిత వ్యక్తి ఆస్తికి భద్రత కల్పించాలనే అతని బాధ్యతాయుత ప్రవర్తనకు దివ్య మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అమ్జద్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉండటం అరుదు” అని పలువురు వ్యాఖ్యానించారు. అమ్జద్ చేసిన పని కేవలం ప్రశంసలకే కాదు, తగిన బహుమతికి కూడా అర్హమని కొందరు సూచించారు. నగరాల్లో మనుషుల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో, ఇలాంటి ఘటనలు సమాజంపై నమ్మకాన్ని కలిగిస్తాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టానికి దారితీయకుండా కాపాడిన అమ్జద్ కథ, “మంచితనం ఎప్పుడూ ఓడిపోదు” అని మరోసారి నిరూపించింది. ఈ సంఘటనను ప్రపంచానికి పరిచయం చేసిన దివ్యను కూడా నెటిజన్లు అభినందిస్తున్నారు.
వీడియోను ఇక్కడ చూడండి:
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..