Virat Kohli Instagram Controversy: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు, సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో, ఒక జర్మన్ యువతి ఫోటోను కోహ్లీ లైక్ చేయడం నెట్టింట పెద్ద దుమారమే రేపింది. ఈ సున్నితమైన విషయంపై సదరు ఇన్ఫ్లుయెన్సర్ లిజ్ లాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసలు ఏం జరిగింది?
ఏప్రిల్ 16, 2026న సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త దావానలంలా వ్యాపించింది. విరాట్ కోహ్లీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి జర్మన్ ఇన్ఫ్లుయెన్సర్ లిజ్ లాజ్ పాత ఫొటోను లైక్ చేశారని నెటిజన్లు గుర్తించారు. కోహ్లీ ఆమెను ఫాలో కాకపోయినా, ఎప్పుడో జనవరిలో పోస్ట్ చేసిన ఫోటోను లైక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. అయితే, కొద్దిసేపటికే ఆ లైక్ మాయమవ్వడం పలు అనుమానాలకు దారితీసింది.
మౌనం వీడిన లిజ్ లాజ్..
ఈ విషయంపై తాజాగా లిజ్ లాజ్ ఒక ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వార్తల ద్వారానే తనకు ఈ విషయం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. “ఉదయం నిద్రలేవగానే నేను వార్తల్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ఆ ఫోటోను ఎప్పుడు లైక్ చేశారో కూడా నాకు తెలియదు. నెటిజన్లు పంపిన సందేశాల ద్వారానే ఈ విషయం నాకు అర్థమైంది,” అని ఆమె తెలిపారు.
అంతేకాకుండా, కోహ్లీపై వస్తున్న విమర్శల పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చని, దీనిపై అతడిని విమర్శించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తన ఫోటోను లైక్ చేసినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ, దానివల్ల ఆయన ఇబ్బంది పడటం తనకు నచ్చలేదని ఆమె పేర్కొన్నారు.
పాత సంఘటనల గుర్తు..
ఈ ఉదంతం గతేడాది జరిగిన అవనీత్ కౌర్ వివాదాన్ని గుర్తు చేస్తోంది. 2025లో కూడా కోహ్లీ ఒక నటి ఫోటోను లైక్ చేసినప్పుడు నెటిజన్లు ఇలాగే స్పందించారు. అప్పట్లో కోహ్లీ స్పందిస్తూ, తన ఫీడ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ సాంకేతిక లోపం (అల్గారిథం) వల్ల పొరపాటున ఆ లైక్ పడిందని వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..