
బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం కెరీర్ పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుపొందిన అమీర్, దంగల్ తర్వాత చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేకపోయారు. లాల్ సింగ్ చద్దా, భారీ అంచనాలున్న సితారే జమీన్ పర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో, ఆయన భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. దీంతో, కొత్త కథల ప్రయోగాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి, పాత, నిరూపితమైన ఫార్ములాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, త్రీ ఇడియట్స్ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు అమీర్ ఖాన్ స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా, ఆయన కెరీర్ లో మలుపు తిప్పిన లగాన్ సినిమా దర్శకుడు అశుతోష్ గోవర్కర్ తో మరోసారి జట్టు కడుతున్నారు. ఈ కాంబినేషన్లో దేశ విభజన అనంతరం భారత్-పాక్ మధ్య జరిగిన ఒక చారిత్రక మ్యాచ్ నేపథ్యంలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా రానుంది.