మీ ఫోన్కు అకస్మాత్తుగా నెట్వర్క్ సిగ్నల్ పోయిందా? కాల్స్, మెసేజ్లు ఆగిపోయాయా? ఇది సాధారణ నెట్వర్క్ సమస్యగా కనిపించినా, వాస్తవానికి అది ఒక పెద్ద మోసానికి సంకేతం కావొచ్చు. ఇటీవల దేశంలో వేగంగా పెరుగుతున్న సిమ్ స్వాప్ స్కామ్ లో ఇదే మొదటి హెచ్చరికగా నిపుణులు చెబుతున్నారు. ఈ మోసంలో హ్యాకర్లు మీ బ్యాంక్ ఖాతాను నేరుగా హ్యాక్ చేయరు. బదులుగా మీ మొబైల్ నంబర్ను లక్ష్యంగా చేసుకుంటారు. మోసగాళ్లు టెలికాం కంపెనీని మోసం చేసి, మీ నంబర్కు డూప్లికేట్ సిమ్ జారీ చేయిస్తారు. అలా జరిగితే మీ సిమ్ పనిచేయడం ఆగిపోతుంది. అదే సమయంలో కొత్త సిమ్ ద్వారా మీకు రావాల్సిన అన్ని OTPలు, బ్యాంక్ అలర్ట్లు నేరుగా మోసగాళ్లకు చేరుతాయి.
భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు ఎక్కువగా OTP ఆధారిత ధృవీకరణపై ఆధారపడుతున్నందున, ఈ ఒక్క చర్యతోనే మోసగాళ్లు మీ ఖాతాలోకి ప్రవేశించి డబ్బును తరలించగలుగుతున్నారు. కొన్ని కేసుల్లో నిమిషాల వ్యవధిలోనే లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్యపై TRAI ఇప్పటికే కొన్ని భద్రతా చర్యలు అమలు చేస్తోంది. అలాగే RBI కూడా బ్యాంకులను OTP వ్యవస్థలకు ప్రత్యామ్నాయ భద్రతా పద్ధతులను బలోపేతం చేయాలని సూచిస్తోంది.
నిపుణుల సూచనల ప్రకారం మీ ఫోన్ అకస్మాత్తుగా సిగ్నల్ కోల్పోతే వెంటనే అప్రమత్తం కావాలి. ఆలస్యం చేయకుండా మీ టెలికాం ఆపరేటర్ను సంప్రదించాలి. అలాగే బ్యాంకుకు సమాచారం ఇచ్చి ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయించడం మంచిది. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దు. ఫిషింగ్ కాల్స్, నకిలీ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ మొబైల్ నంబర్ ఇప్పుడు మీ డిజిటల్ గుర్తింపు కావడంతో, దాన్ని రక్షించుకోవడం అత్యంత అవసరం. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఆర్థిక నష్టానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి