Headlines

“మాట-చేత ఒక్కటే కావాలి..” ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్ శతజయంతి ఉత్సవాల్లో దత్తాత్రేయ హోసబలే పిలుపు

“మాట-చేత ఒక్కటే కావాలి..” ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్ శతజయంతి ఉత్సవాల్లో దత్తాత్రేయ హోసబలే పిలుపు


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సంస్థా నిర్మాత, మాజీ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సివిక్ సెంటర్‌లో ‘ప్రియ కేల్కర్ జీ’ అనే ప్రత్యేక పఠన కార్యక్రమం నిర్వహించారు. ఏబీవీపీ ఢిల్లీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ముఖ్య అతిథిగా పాల్గొని కేల్కర్ జీ స్మృతులను గుర్తు చేసుకున్నారు.

1925 ఏప్రిల్ 25న మహారాష్ట్రలోని పండర్‌పూర్‌లో జన్మించిన యశ్వంతరావు కేల్కర్, విద్యార్థి దశ నుంచే జాతీయవాద చింతనతో పెరిగారు. 1945లో సంఘ్ ప్రచారక్ గా ప్రస్థానం ప్రారంభించి, 1955లో నేషనల్ కాలేజీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఆయన జీవితాశయం విద్యార్థి లోకాన్ని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే.. ఏబీవీపీకి సైద్ధాంతిక స్పష్టతను, సంస్థాగత దార్శనికతను అందించిన ఘనత ఆయనదే. ‘విద్యార్థి శక్తి – రాష్ట్ర శక్తి’ అనే నినాదానికి ఆయన ప్రాణం పోశారు. ఈ కార్యక్రమంలో మిలింద్ భడ్గే నేతృత్వంలోని పూణేకు చెందిన ‘అభివచన్’ బృందం ప్రదర్శించిన నాటకీయ పఠనం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కేల్కర్ జీ జీవితం, ఆయన పని పద్ధతి, క్రమశిక్షణ మరియు సమయపాలనను కళ్లకు కట్టినట్లుగా ఈ ప్రదర్శన సజీవంగా చిత్రీకరించింది.

ఈ సందర్భంగా ప్రముఖుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. కేల్కర్ జీ డాక్టర్ హెడ్గేవార్ నిజమైన ఆధ్యాత్మిక వారసులు అని ముఖ్య అతిథి దత్తాత్రేయ హోసబలే అన్నారు. ఆయన కేవలం కార్యకర్తలను మాత్రమే కాదు, సంస్థకు పటిష్టమైన పునాదులను నిర్మించారని తెలిపారు. విద్యార్థి పరిషత్తులో లభించిన జీవన దృక్పథమే సంఘ్ పనిలో మరింత పరిఢవిల్లింది అని అయన పేర్కొన్నారు. ఏబీవీపీని కేవలం ఒక ఆందోళనల సంఘంగా కాకుండా, దేశ నిర్మాణానికి ఉపయోగపడే నిర్మాణాత్మక వేదికగా మార్చిన దార్శనికత కేల్కర్ జీదని దత్తాత్రేయ హోసబలే కొనియాడారు.

ఏబీవీపీ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ రఘురాజ్ కిషోర్ తివారీ మాట్లాడుతూ, కేల్కర్ జీ వారసత్వం నేడు దేశవ్యాప్తంగా ప్రతి కార్యకర్తలో కనిపిస్తుందని, మాటలకు-చేతలకు వ్యత్యాసం ఉండకూడదనే పాఠాన్ని ఆయన నుండి నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ అధ్యక్షులు రాజ్‌కుమార్ భాటియా మాట్లాడుతూ, విద్యార్థి పరిషత్తును వ్యక్తిత్వ నిర్మాణానికి ఒక కర్మాగారంగా కేల్కర్ భావించేవారని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మను శర్మ కటారియా, డాక్టర్ తపన్ బిహారీ, సార్థక్ శర్మతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు మరియు వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కేల్కర్ జీ శతజయంతి వేడుకలు విద్యార్థి లోకానికి నూతన ఉత్తేజాన్ని అందించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *