Headlines

భ్రమల్లో బతుకుతున్నారు.. మెంటల్ ట్రీట్‌మెంట్ అవసరం.. ట్రంప్‌పై ఇరాన్ ఫైర్..


భ్రమల్లో బతుకుతున్నారు.. మెంటల్ ట్రీట్‌మెంట్ అవసరం.. ట్రంప్‌పై ఇరాన్ ఫైర్..

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం మరోసారి తారస్థాయికి చేరింది. వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ట్రంప్‌ ఆలోచనా ధోరణిని తప్పుపడుతూ, ఆయనను మనోవైకల్యం బాధితుడిగా ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కజెమ్ ఘరీబాబాది అభివర్ణించారు. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా చూపిస్తూ ట్రంప్ ఇటీవల ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఘరీబాబాది తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘స్కిజోఫ్రెనియా అంటే వాస్తవికతను గుర్తించలేని ఒక మానసిక రుగ్మత. భ్రమల్లో బతికే ఇలాంటి వారికి మానసిక నిపుణులు 24 గంటల పర్యవేక్షణ, నిరంతర చికిత్సను సిఫార్సు చేస్తారు’’ అంటూ ట్రంప్‌పై తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. హర్ముజ్ జలసంధి మార్గం తెరిచే ఉందని, అమెరికా సైనిక చర్యపై ఇరాన్ స్పందన చాలా మోడరేట్‌గా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా మళ్లీ తమపై దాడి చేయకూడదనే ఉద్దేశంతోనే టెహ్రాన్ వెనక్కి తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇరాన్ ఆగ్రహానికి ఆజ్యం పోశాయి. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అమెరికా తీరుపై ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వాషింగ్టన్ విధిస్తున్న ఆంక్షలు పూర్తిగా ‘‘చట్టవిరుద్ధం, అన్యాయమైనవి’’ అని పేర్కొంటూ, అంతర్జాతీయ సమాజం వీటిని తిరస్కరించాలని కోరింది. అమెరికా చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ మానవతా చట్టాలు, మానవ హక్కుల సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని టెహ్రాన్ ఆరోపించింది.

అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఆంక్షలను అమలు చేసే దేశాలు సార్వభౌమత్వ సమానత్వాన్ని దెబ్బతీస్తున్నట్లేనని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని అణచివేయడంలో వాషింగ్టన్‌కు సహకరిస్తున్నట్లేనని ఇరాన్ హెచ్చరించింది. న్యాయబద్ధమైన అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సంబంధాలను దెబ్బతీసే ఇలాంటి ఏకపక్ష ఆంక్షలను ఎవరూ గుర్తించకూడదని అంతర్జాతీయ దేశాలకు టెహ్రాన్ పిలుపునిచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *