Headlines

భర్త కళ్లల్లో కారం కొట్టి దారుణం.. శనివారం అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..


మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడిని కొండ శ్రీరాములు (45)గా పోలీసులు గుర్తించారు. భార్య సబిత (40), కుమారుడు భారత్‌ (20).. ఇద్దరూ శ్రీరాములును హత్య చేసినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. శ్రీరాములు బోర్‌వెల్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా కుటుంబ వ్యవహారాల విషయంలో భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంపాదించిన డబ్బును కుటుంబానికి సరిగా ఇవ్వడం లేదని, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భార్య శ్రీరాములుతో గొడవ పడుతోంది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భార్య సబిత, కుమారుడు భారత్‌కు శ్రీరాములుతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.. అనంతరం ఇద్దరూ కలిసి అతడిపై దాడి చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

ముందుగా శ్రీరాములు కళ్లలో కారం కొట్టి.. ఆపై బండరాయితో ముఖంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం సబిత, భారత్‌ తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *