
హర్యానా, జులై 30: హర్యానాలోని ఫరీదాబాద్లోని గౌంచి గ్రామానికి చెందిన దీపక్ తన కుటుంబంతో కలిసి గ్రామాల మధ్య తిరుగుతూ సర్కస్ ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగించేవాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇలాంటి ప్రదర్శనల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో నుహ్ జిల్లా తౌరు ప్రాంతంలోని ఖోరీ గ్రామంలో ఖాళీ స్థలంలో సర్కస్ బృందం తాత్కాలికంగా మకాం వేశారు. వారం రోజులుగా దీపక్ ముందుగా సైక్లింగ్ సహా పలు విన్యాసాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. సర్కర్ చివరి రోజున అతను ఎప్పటినుంచో చేస్తున్న ప్రమాదకరమైన సజీవ సమాధి స్టంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా దీపక్ను ఒక సంచిలో ఉంచి, ప్రత్యేకంగా తవ్విన గుంతలోకి దించి, దానిపై మట్టిని కప్పారు. 24 గంటల తర్వాత అతడ్ని సజీవంగా బయటకు తీస్తామని సర్కాస్ బృందం తెలిపింది. అయితే ఈసారి పరిస్థితి విషమించింది. సర్కర్ నిర్వాహకులు 36 గంటల పాటు అతడిని సమాధిలోనే ఉంచింది. ఆ తర్వాత సర్కార్ సహచరులు అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా, అతను స్పందించలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మట్టిలో కూరుకుపోవడం వల్ల ఊపిరాడకపోవడం (Suffocation) కారణంగా దీపక్ మృతి చెందినట్లు భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తాయని అధికారులు తెలిపారు. ప్రాథమికంగా మట్టిలో ఊపిరాడకపోవడమే మృతికి కారణంగా కనిపిస్తోంది. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయని తౌరు సదర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాజేష్ కుమార్ తెలిపారు.
స్థానికుల సమాచారం ప్రకారం రూ. 7,100 వసూలయ్యే వరకు దీపక్ను బయటకు తీయబోమని సర్కస్ నిర్వాహకులు ప్రేక్షకులకు చెప్పినట్లు ఆరోపించారు. ఈ షరతు కారణంగానే 24 గంటల కంటే చాలా ఆలస్యంగా గుంతను తెరువడంతో దీపక్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కాగా ఇలాంటి సజీవ సమాధి ప్రదర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో గతంలో సాధారణంగా ఉండేవని, అయితే సాధారణంగా కొన్ని గంటల నుంచి ఒకటి లేదా రెండు రోజుల వరకు మాత్రమే నిర్వహించేవారని తెలిపారు. ఈసారి మూడు రోజుల పాటు మట్టిలో ఉండేలా ప్రదర్శన నిర్వహించడం ప్రమాదకరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. నుహ్ జిల్లా కమిషనర్ అఖిల్ పిలానీ మాట్లాడుతూ ఇలాంటి ప్రాణాపాయ స్టంట్లు చట్టవిరుద్ధమని తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇలాంటి ప్రమాదకర కార్యక్రమం ఎలా నిర్వహించారనే అంశంపై అధికారులు విచారణ చేపడతారని వెల్లడించారు. దీపక్ మృతితో సర్కస్ బృందం సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.