Headlines

High Court: ఆధార్, ఓటర్ ఐడీతోనే పౌరసత్వం రుజువు కాదు.. కలకత్తా హైకోర్టు కీలక తీర్పు

High Court: ఆధార్, ఓటర్ ఐడీతోనే పౌరసత్వం రుజువు కాదు.. కలకత్తా హైకోర్టు కీలక తీర్పు


పౌరసత్వం అంశంపై కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలు ఉంటే సరిపోదని, ఇవి భారత పౌరసత్వానికి తుది ఆధారాలు కావని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ పౌరుడిగా గుర్తించి నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ ‘నాసిర్’ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

పౌరసత్వ నిరూపణ బాధ్యత వ్యక్తిదే

తాను భారత పౌరుడినని నిరూపించుకునే బాధ్యత పూర్తిగా సంబంధిత వ్యక్తిపైనే ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. భారత పౌరుడినని నిరూపించేందుకు నాసిర్‌కు అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ, ఆయన సరైన ఆధారాలను సమర్పించలేకపోయారని కోర్టు వెల్లడించింది. ఓటర్ ఐడీ అనేది కేవలం ఓటర్ల జాబితాలో పేరు నమోదైందని తెలిపే పత్రం మాత్రమే తప్ప, పౌరసత్వానికి నిర్ధారిత ఆధారం కాదని స్పష్టం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించిన తర్వాత నాసిర్ పేరును ఓటర్ల జాబితా నుండి తొలగించిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. అదేవిధంగా ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్‌లు కూడా ప్రాథమిక ఆధారాలు కావని తేల్చిచెప్పింది.

పోలీసుల అదుపులో ఉన్న సమయంలో తాను బంగ్లాదేశ్ పౌరుడినని, భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించానని నాసిర్ ఒప్పుకున్నట్లు ప్రభుత్వ ప్లీడర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కస్టడీలో ఇచ్చిన ప్రకటనల చట్టబద్ధతను పక్కనపెట్టినా, పౌరసత్వాన్ని రుజువు చేయడంలో పిటిషనర్ విఫలమయ్యారని ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణలో భాగంగా నాసిర్ తన జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించలేకపోయారు. అంతేకాకుండా, తన తల్లిదండ్రుల సమాధుల వివరాలను కూడా స్పష్టంగా చెప్పలేకపోవడంతో, ఆయన పౌరసత్వాన్ని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించే అవకాశం కూడా లేకుండా పోయిందని కోర్టు వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *