గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో ఓ సింహం వేట కోసం జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తూ 15 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. ఓ వ్యవసాయ క్షేత్రంలో రాత్రిపూట ఆహారం కోసమో, నీటి కోసమో వెతుకుతూ వచ్చిన సింహం పొరపాటున బావిలో పడిపోయింది. పైకి రాలేక నీటిలో తడబడుతూ అది చేసిన గర్జనలు విన్న స్థానికులు దానిని గమనించి అటవీ శాఖకు సమాచారం అందించారు.. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ చౌహాన్ నేతృత్వంలోని బృందం, పోలీసుల సాయంతో అక్కడికి చేరుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సింహాన్ని పైకి లాగేందుకు బావిలోకి బలమైన తాళ్లు వేయగా.. తీవ్ర భయాందోళనలో ఉన్న ఆ మృగం వాటిని కొరికేస్తూ సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది. సుమారు గంట పాటు తీవ్రంగా శ్రమించిన అధికారులు చివరికి ఓ తాడును ఉచ్చులా వేసి సింహాన్ని పైకి లాగారు. బావి అంచున ముందుగానే సురక్షితంగా ఏర్పాటు చేసిన బోనులోకి అది నేరుగా వెళ్లడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలతో బయటపడిన ఆ సింహాన్ని వైద్య పరీక్షల కోసం యానిమల్ కేర్ సెంటర్కు తరలించారు. ఎలాంటి గాయాలు లేకపోవడంతో తిరిగి గిర్ అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు. అటవీ సిబ్బంది ధైర్యసాహసాలను, వారి సమన్వయాన్ని ప్రశంసిస్తూ గుజరాత్ ఉప ముఖ్యమంత్రి సంఘవీ రెస్క్యూ వీడియోను ‘ఎక్స్’ లో షేర్ చేసారు. అటవీ ప్రాంతాలకు ఆనుకుని పొలాల్లోని బావులకు రక్షణ గోడలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రెస్క్యూ ఆపరేషన్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన
ఇంట్లో తిట్టారని వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడిని.. పాతికేళ్లకు ఫేస్బుక్ కలిపింది
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన జనం