Headlines

ఫుకెట్-ఢిల్లీ విమాన పైలట్‌పై వేటు.. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్


ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే ఘటన చోటుచేసుకుంది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI2379 విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కమాండర్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. సైకోయాక్టివ్‌ (మానసిక ప్రభావం చూపే) పదార్థానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో పైలట్ ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది.

భద్రత, విధులకు అనుకూలత, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన విషయంలో తమది జీరో టాలరెన్స్ విధానమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఈ విధానంలో భాగంగానే పైలట్‌పై ఎలాంటి ఆలస్యం లేకుండా ఉద్యోగం నుంచి తొలగింపు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

300 అడుగుల మేర అకస్మాత్తుగా మారిన విమాన ఎత్తు

ఈ పరిణామం ఆగస్టు 4న జరిగిన విమాన ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసిన ప్రాథమిక నివేదిక నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌బస్ A320 విమానం ఫుకెట్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేర ఎత్తులో మార్పు చోటుచేసుకుంది. దాదాపు నాలుగు సెకన్ల పాటు విమానంపై నియంత్రణ కోల్పోయిన పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు సమాచారం.

పైలట్‌పై సైకోయాక్టివ్ పదార్థం నిర్ధారణ

ఘటనపై దర్యాప్తులో భాగంగా నిర్వహించిన పరీక్షలో విమాన కమాండర్ మొదట నాన్-నెగెటివ్‌ గా తేలారు. అనంతరం నిర్వహించిన నిర్ధారణ పరీక్షలోనూ సైకోయాక్టివ్ పదార్థం ఉన్నట్లు గుర్తించినట్లు AAIB తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. విమానయాన రంగంలో పైలట్లు విధులు నిర్వహించే సమయంలో ఇలాంటి పదార్థాల ప్రభావానికి లోనుకాకుండా ఉండటం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో సైకోయాక్టివ్ పదార్థాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రాధాన్యతా క్రమంలో తగిన చర్యలు తీసుకోవాలని AAIB సూచించింది.

హైడ్రాలిక్ వ్యవస్థ వైఫల్యాలపైనా దర్యాప్తు

అయితే విమానంలో చోటుచేసుకున్న ఘటనకు పైలట్ పరీక్ష ఫలితమే కారణమని ఇప్పుడే తేల్చలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విమానంలోని పలు హైడ్రాలిక్ వ్యవస్థల్లో నమోదైన వైఫల్యాలను కూడా దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. AAIB తన ప్రాథమిక నివేదికను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపింది. ఈ నివేదికను ఘటనకు తుది కారణ నిర్ధారణగా పరిగణించరాదని స్పష్టం చేసింది. సాంకేతిక అంశాలతో పాటు ఇతర పరిస్థితులపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

పైలట్లకు డ్రగ్ టెస్టులు మరింత కఠినతరం

ఈ ఘటన అనంతరం ఎయిర్ ఇండియా పైలట్ల సైకోయాక్టివ్ పదార్థాల పరీక్ష విధానాన్ని మరింత కఠినతరం చేసింది. గతంలో యాదృచ్ఛికంగా (రాండమ్‌గా) నిర్వహించే పరీక్షలకు అదనంగా, భద్రతా చర్యల్లో భాగంగా సైకోయాక్టివ్ పదార్థాల పరీక్షలను తప్పనిసరి చేసే విధంగా వ్యవస్థను బలోపేతం చేసింది. ఆగస్టు 4 ఘటనకు సంబంధించిన సాంకేతిక, ఇతర కారణాలపై AAIB దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి దర్యాప్తు అనంతరం తుది నివేదిక వెలువడిన తర్వాతే ఘటనకు అసలు కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *