ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు


విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి ‘ఏఐ గేట్‌వే’గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శ్రీకారం చుట్టారు.

విశాఖ సమీపంలోని తర్లువాడలో లక్షా 35 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో, దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒక గిగావాట్ (1000 మెగావాట్స్) సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. అదానీ కనెక్ట్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా సంస్థలు ఈ మెగా ప్రాజెక్టులో గూగుల్‌తో చేతులు కలిపాయి. 2028 సెప్టెంబరు నాటికి నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్ సర్వీసెస్, డీప్ లెర్నింగ్, హైస్పీడ్ ఏఐ ట్రైనింగ్‌లకు ఇది గుండెకాయలా మారనుంది.

శంకుస్థాపన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం సైబరాబాద్ ఎలాగైతే సంపద సృష్టించిందో, ఇప్పుడు విశాఖ గూగుల్ సెంటర్ ఏపీ భవిష్యత్తును మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డేటా సెంటర్ రాకతో ఐటీ స్టార్టప్‌లు, సెమీకండక్టర్ కంపెనీలు వైజాగ్‌కు క్యూ కట్టనున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ రంగాల్లో యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. త్వరలో ఏఐ అసిస్టెంట్ ద్వారా సీఎం కార్యాలయం నుండి సుపరిపాలన అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాలా మారుతుందని, ఏఐ అసిస్టెంట్ సహాయంతో ‘స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్’ను అందిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటనలు చేశారు. దక్షిణాది అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేసే వారికి సమాధానంగా డైమండ్ షేప్ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రస్తావించారు. హైదరాబాద్ – అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ద్వారా ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలకు తగ్గుతుందని వెల్లడించారు. ఏపీకి రైల్వే బడ్జెట్ గతంలో రూ. 886 కోట్లు ఉంటే, ఇప్పుడు రూ. 10,134 కోట్లకు పెంచామని తెలిపారు. జూన్ 1 నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుభవార్త చెప్పారు.

జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం, 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎగుమతులు ప్రారంభం కానున్నాయని చంద్రబాబు తెలిపారు. గూగుల్ రాకతో టాలెంట్ మైగ్రేషన్ ఆగిపోయి, ఇతర ప్రాంతాల నుంచే విశాఖకు ఉద్యోగులు వచ్చే రోజులు వచ్చాయని ఉద్ఘాటించారు. ఈ మెగా ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ఐటీ పటంలో ధ్రువతారగా నిలవనుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *