బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చింది. ఆయనకు గుండెపోటు రావడంతో ఆదివారం (జూలై 26) తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై రోహిణి ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డిని హార్ట్ స్ట్రోక్తో ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆయన హార్ట్ ఫంక్షనింగ్ నియంత్రణలో ఉందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
వైద్య పరీక్షల్లో ఆయనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించినట్లు డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని వైద్యులు, కుటుంబ సభ్యులు కోరారు.
అంతకుముందు ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితర నాయకులు వరంగల్ బయల్దేరి వెళ్లారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించిన ఆయనకు పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..