
మనలో చాలామందికి నాన్ వెజ్ కూరలు లేదా బిర్యానీ తింటున్నప్పుడు పైన కాస్త నిమ్మరసం పిండుకుని తినే అలవాటు ఉంటుంది. ఇది కేవలం రుచిని పెంచడానికే అనుకుంటే పొరపాటే.. రోజూ ఆహారంపై నిమ్మరసం జోడించి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చిన్న అలవాటులో దాగి ఉన్న ప్రయోజనాలు, నిమ్మకాయను ఉపయోగించేటప్పుడు మనం చేసే ఒక పెద్ద తప్పు గురించి చాలా మందికి తెలియదు. ఆహారంపై నిమ్మరసం పిండడం వల్ల అందులోని విటమిన్ సి శరీరంలోని జీర్ణ ఎంజైమ్లను యాక్టివ్ చేస్తుంది. దీనివల్ల ఎంత భారీగా లేదా హెవీగా ఉండే ఆహారం తిన్నా త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా నిమ్మలో ఉండే ఫైబర్ గుణాలు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఐరన్ గ్రహించే శక్తి రెట్టింపు అవుతుంది
శరీరంలో రక్తం తక్కువగా ఉండే వారికి లేదా రక్తహీనత ఉన్నవారికి ఇది ఒక ఔషధం లాంటిది. మనం తినే పాలకూర, పప్పుధాన్యాలు, శనగలు వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలపై నిమ్మరసం పిండుకుని తింటే, ఆహారంలో ఉన్న ప్లాంట్ బేస్డ్ ఐరన్ను శరీరం త్వరగా గ్రహించేలా నిమ్మలోని విటమిన్-సి దోహదపడుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య నుంచి సులువుగా ఉపశమనం లభిస్తుంది.
నిమ్మరసం ఉపయోగించేటప్పుడు చేయకూడని పెద్ద తప్పు
- చాలామంది కూరలు పొయ్యిపై ఉడికేటప్పుడే లేదా బాగా వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం పిండేస్తుంటారు. ఇది అస్సలు చేయకూడదు
- నిమ్మకాయలోని విటమిన్ సి అధిక వేడికి చాలా త్వరగా నశిస్తుంది.
- ఆహారం ఉడుకుతున్నప్పుడు నిమ్మరసం వేస్తే అందులోని పోషకాలన్నీ వేడికి ఆవిరైపోతాయి.
- కాబట్టి వంట పూర్తయి, పొయ్యి ఆఫ్ చేసి, కూర కాస్త చల్లారిన తర్వాత లేదా ప్లేట్లో వడ్డించుకున్నాకే పైన నిమ్మరసం పిండుకోవాలని గుర్తుంచుకోండి.
రోజూ ఆహారంలో సరైన పద్ధతిలో నిమ్మరసాన్ని చేర్చుకోవడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇకపై తినేటప్పుడు వంటకాల్లో నేరుగా పిండకుండా, చివర్లో పిండుకుని తింటూ ఆరోగ్యంగా ఉండండి.