Headlines

దారుణం.. యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన జనం.. పోలీసుల ఎంట్రీతో..!

దారుణం.. యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన జనం.. పోలీసుల ఎంట్రీతో..!


అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దొంగతనం అనుమానంతో ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి సామూహికంగా కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మదనపల్లి సంత గేటు సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంత గేటు వద్ద ఉన్న ఎస్‌కేఎం ట్రేడర్స్‌కు చెందిన ఉల్లి వ్యాపారి దుకాణంలో రూ.20 వేల నగదు చోరీ జరిగినట్లు యజమాని గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మదనపల్లి మండలం వేంపల్లికి చెందిన నాగేంద్ర అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేసిన దుకాణ యజమాని, సిబ్బంది అతడిని పట్టుకుని సమీపంలోని స్తంభానికి కట్టేశారు. అనంతరం పలువురు కలిసి నాగేంద్రపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం.

ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని వారి చెర నుంచి విడిపించి మదనపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిందా? నాగేంద్రకు నిజంగా ఈ ఘటనతో సంబంధం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యక్తిని స్తంభానికి కట్టేసి దాడి చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *