ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి మరోసారి అరుదైన వైద్య విజయాన్ని నమోదు చేసింది. ఈ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ, మైక్రో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో రెండవసారి రెండు చేతుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చాలా అరుదుగా జరుగుతాయి కాబట్టి ఇది వైద్యరంగంలో ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
ఈ శస్త్రచికిత్స ఒక యువతికి నిర్వహించారు. ఆమె పొలంలో పని చేస్తుండగా వరి కోసే యంత్రం ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయింది. ప్రమాదం తర్వాత ఆమె పూర్తిగా ఇతరులపై ఆధారపడే పరిస్థితికి చేరుకుంది. తర్వాత ఆమెను ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత ఆసుపత్రికి ఒక బ్రెయిన్-డెడ్ దాత లభించారు.
ఆ దాత కుటుంబం గొప్ప మనసుతో అవయవదానానికి సమ్మతించి, చేతులను కూడా దానం చేయడానికి ముందుకొచ్చింది. వారి సహకారంతో వైద్యులు సుమారు 12 గంటల పాటు సాగిన క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించి, రెండు చేతుల మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ శస్త్రచికిత్సలో ప్లాస్టిక్ సర్జన్లు, ఆర్థోపెడిక్ నిపుణులు, నెఫ్రాలజిస్టులు, అనస్థీషియా బృందం, ఐసీయూ వైద్యులు, మనోవైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్టులు కలిసి పనిచేశారు. ఈ సమన్వయం కారణంగానే ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని, క్రమంగా కోలుకుంటోందని వైద్యులు అంటున్నారు. ఇది నిజంగా జీవితాన్ని మార్చే శస్త్రచికిత్సగా వైద్యులు చెబుతున్నారు. కళ్లను, కాలేయాన్ని, మూత్రపిండాలను దానం చేసినట్లే చేతులను కూడా దానం చేయవచ్చని వారు తెలిపారు. అవయవదానం ద్వారా మరొకరికి కొత్త జీవితం ఇవ్వవచ్చని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు విజ్ఞప్తి చేశారు.




