ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఎపీ ఎస్సెస్సీ (10వ తరగతి) ఫలితాలను ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్, మనమిత్ర వాట్సప్, లీప్ యాప్ ద్వారా పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు.. విద్యార్ధులు నేరుగా తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పొందొచ్చు. ఏపీ పదో తరగతిలో 85.25శాతం (గత ఏడాది 81.14% నుండి) ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికల ఉత్తీర్ణత 87.90 శాతం కాగా.. బాలుర ఉత్తీర్ణత 82.68 శాతంగా ఉంది. ఏపీలో మొత్తం 12,089 పాఠశాలల్లో చదువుతున్న 6 లక్షల 20వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 5.22 శాతం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం 78.39%కి పెరిగింది.. గత ఏడాది 72.8% మాత్రమే నమోదైంది.
పదవ తరగతి ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..
అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాల్లో 96.07 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. అత్యల్పం అల్లూరు సీతారామరాజు జిల్లా 57.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో 2161 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులకు వచ్చే 25 నుండి జూన్ 4 తేదీ వరకు సప్లమెంటరీ పరిక్షలు నిర్వహించనున్నారు.
ఫెయిల్ అయిన వారు నిరాశ చెందవద్దు..
టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ.. మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈసారి ఉత్తీర్ణులు కాలేకపోయిన వారు దయచేసి నిరాశ చెందవద్దు.. కుటుంబాలు, ఉపాధ్యాయులు, సమాజం యొక్క మద్దతుతో, మీరు మరింత బలంగా తిరిగి విజయం సాధించగలరంటూ సూచించారు. మన విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వెన్నెముక.. ప్రతి బిడ్డ విజయం సాధించేలా చూడటానికి తాము కట్టుబడి ఉన్నామంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ పెట్టుబడులు, విప్లవాత్మక ప్రాజెక్టుల ద్వారా వార్తల్లో నిలుస్తుండటం నాకు ఎంతో గర్వకారణం. అయితే, ఒక మానవ వనరుల అభివృద్ధి (HRD) మంత్రిగా, SSC ఫలితాల్లో కనిపిస్తున్న నిలకడైన పురోగతి తనకు అంతకంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ పురోగతి మన విద్యార్థుల దృఢ సంకల్పాన్ని, అలాగే ఉపాధ్యాయులు, కుటుంబాల బలమైన మద్దతును ప్రతిబింబిస్తుందన్నారు.