అమరావతి, జులై 26: తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఈఏపీసెట్ కౌన్సిలింగ్ జులై 25న ప్రారంభం కావల్సి ఉంది. అయితే వెబ్ ఐచ్ఛికాల నమోదుకు జులై 25 రాత్రి వరకూ సంబంధిత పోర్టల్ ఓపెన్ కాలేదు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం నుంచి వెబ్ ఐచ్ఛికాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే అది అందుబాటులోకి రాలేదు. ఫీజుల జీవో విడుదలలో జాప్యం కారణంగానే వెబ్ ఐచ్ఛికాల నమోదుకు ఆలస్యమైంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అయి జూలై 31, 2026 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆప్షన్స్ నమోదు చేసిన అభ్యర్థులకు ఆగస్టు 1న తమ వెబ్ ఆప్షన్లను సవరించుకునే (Edit) అవకాశం కల్పించారు. ఏపీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జూలై 29, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అలాగే అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ (Document Verification) ప్రక్రియ జూలై 31, 2026 వరకు కొనసాగుతుంది.
ఆగస్టు 10 నుంచి తరగతులు
ఫేజ్-1 సీట్ల కేటాయింపు (Seat Allotment) ఫలితాలను ఆగస్టు 6, 2026న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్లు, ర్యాంకు (మెరిట్) ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి 13 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు కేటాయించిన కాలేజీలో ప్రత్యక్షంగా హాజరై అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపికలో ర్యాంకు, గత సంవత్సరాల కటాఫ్లు, వ్యక్తిగత ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇక ఏపీ ఈఏపీసెట్ 2026 ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్టు 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- AP EAPCET 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 29, 2026.
- వెబ్ ఆప్షన్ల నమోదు చివరి తేదీ: జూలై 31, 2026.
- సర్టిఫికేట్ వెరిఫికేషన్ చివరి తేదీ: జూలై 31, 2026.
- వెబ్ ఆప్షన్ల సవరణ: ఆగస్టు 1, 2026.
- ఫేజ్ 1 సీట్ల కేటాయింపు: ఆగస్టు 6, 2026.
- సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్టింగ్ తేదీలు: ఆగస్టు 7 నుంచి 13 వరకు
- తరగతుల ప్రారంభం: ఆగస్టు 10, 2026 నుంచి