Headlines

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు, రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది


మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ABC ప్రింటింగ్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

ABC ప్రింటింగ్ పరిశ్రమ కావడం, లోపల భారీగా పెయింట్లు, కెమికల్స్, ద్రవపదార్థాలు మరియు కాగితపు నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు పరిశ్రమ అంతటా విస్తరించి, ఆకాశాన్ని తాకేలా దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన పరిశ్రమ కార్మికులు, స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు మరియు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రింటింగ్ ప్రెస్ లోపల ఉన్న పెయింట్స్, రసాయనాల వల్ల మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, వాటిని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో లోపల ఉన్న కార్మికులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పిందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే, పరిశ్రమలోని రూ. లక్షల విలువైన ప్రింటింగ్ మిషన్లు, కాగితపు నిల్వలు, పెయింట్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి పరిశీలిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *