
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా చమురు, గ్యాస్ రవాణాపై ఏర్పడిన అంతరాయాలు, భారత్లో వంటగ్యాస్ సరఫరాపై ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్పై ఆధారాన్ని తగ్గిస్తూ, ఇండక్షన్ కుక్టాప్ల వినియోగం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇండక్షన్ కుక్టాప్ల ధరలను తగ్గించి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి, వాటి కీలక విడిభాగాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించే యోచనలో కేంద్రం ఉంది. అదే సమయంలో ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే మార్కెట్లో ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
డిమాండ్ పెరుగుదల కారణంగా ఏర్పడిన సరఫరా సవాళ్లను ఎదుర్కొనేందుకు, పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) నేతృత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాయి. ఈ సమావేశాల్లో సరఫరా గొలుసు సమస్యలు, ధరల స్థిరీకరణపై చర్చలు జరిగాయి. ఇదే సమయంలో కొన్ని విద్యుత్ ఉపకరణాలపై తప్పనిసరి నాణ్యత నియంత్రణ ఉత్తర్వు (QCO) అమలును 2026 అక్టోబర్ వరకు ఆరు నెలలు వాయిదా వేయడం ద్వారా తయారీదారులకు ఊరటనిచ్చారు. అలాగే, ఇంధన సామర్థ్య ప్రమాణాల గడువులను కూడా పొడిగించారు.
ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు, పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (PESO) పలు కీలక చర్యలు చేపట్టింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 21 వరకు వచ్చిన 467 దరఖాస్తుల్లో 157కు తుది లైసెన్సులు మంజూరు చేయగా, 38 కొత్త CNG/CBG స్టేషన్లకు ముందస్తు అనుమతులు ఇచ్చారు. అదనంగా, బయోగ్యాస్ నిల్వ, నింపే ప్లాంట్లకు అనుమతులు వేగవంతం చేశారు. ఇంధన లభ్యతను మెరుగుపర్చేందుకు LNG సరఫరాను వికేంద్రీకరించే చర్యలు, క్రయోజెనిక్ సిలిండర్ల వినియోగానికి మార్గదర్శకాలు, LPG ప్లాంట్లలో రాత్రి కార్యకలాపాలకు అనుమతులు వంటి చర్యలు అమలు చేస్తున్నారు. ఇవి సరఫరా సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి