మేడ్చల్ జిల్లా: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనిక చిన్నప్పటి నుంచే కష్టపడి చదువుకున్నారు. మంచి ఉద్యోగం సాధించి స్వతంత్రంగా నిలబడాలన్న లక్ష్యంతో ముందుకు సాగారు. ఈ క్రమంలో వైజాగ్కు చెందిన రమాకాంత్తో పరిచయం ఏర్పడి, అనంతరం ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డారు.
మౌనిక, రమాకాంత్ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు తల్లిగా, భార్యగా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ జీవితం కొనసాగించారు. చిన్నారుల నవ్వులతో వారి కుటుంబం ఆనందంగా సాగుతుండగా, మౌనిక మృతి విషాదాన్ని నింపింది. నిన్న ఉదయం మౌనిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం. గెలాక్సీ టవర్స్లో ఆమె మృతదేహం లభించడంతో స్థానికంగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఇవి కూడా చదవండి
మౌనిక మృతికి అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పోస్ట్మార్టం నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా మృతికి గల కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. మౌనిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా తల్లిని కోల్పోయిన కవల చిన్నారుల భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికావాల్సి ఉంది.