ఇల్లు నిర్మించుకోవడం ప్రతి కుటుంబానికి ఒక కల. అయితే నిర్మాణం మధ్యలోనే సుతారి మేస్ట్రీ పని ఆపేసి మళ్లీ రాకపోవడం, కొన్ని రోజుల తర్వాత వస్తా, వేరే ఇల్లు కంప్లీట్ చేసి వస్తా అంటూ తన చుట్టూ తిప్పించుకుంటూ, అడ్వాన్స్ తీసుకుని పనిని పూర్తి చేయకపోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి యజమాని ఏం చేయాలి? మేస్ట్రీపై కేసు పెట్టే అవకాశం ఉందా? చట్టాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
న్యాయ నిపుణుల ప్రకారం.. మేస్ట్రీ లేదా కాంట్రాక్టర్తో రాతపూర్వక ఒప్పందం (Agreement) ఉంటే ఇంటి యజమానికి బలమైన చట్టపరమైన ఆధారం ఉంటుంది. పనిని ఎంత రోజుల్లో పూర్తి చేయాలి, ఎంత మొత్తం చెల్లించాలి, పని నాణ్యత ఎలా ఉండాలి వంటి అంశాలు ఒప్పందంలో ఉంటే, వాటిని ఉల్లంఘించిన పక్షంలో సివిల్ కోర్టులో కేసు వేయవచ్చు. పనిలో జాప్యం వల్ల కలిగిన ఆర్థిక నష్టానికి నష్టపరిహారం కూడా కోరే అవకాశం ఉంటుంది.
ఇది చదవండి: ఇల్లు కట్టుకుంటున్నారా? మార్బుల్, గ్రానైట్, కోటా స్టోన్.. ఏది తక్కువ ధరలో వస్తుందో తెలుసుకోండి?
ఒప్పందం లేకపోయినా, బ్యాంక్ లావాదేవీలు, ఆన్లైన్ చెల్లింపులు, వాట్సాప్ సందేశాలు, ఫోన్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు వంటి ఆధారాలు ఉంటే వాటి ఆధారంగా కూడా న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి కేసు పరిస్థితులను బట్టి కోర్టు నిర్ణయం ఉంటుంది. కేవలం పని ఆపేసి వెళ్లిపోవడం మాత్రమే జరిగితే అది సాధారణంగా సివిల్ వివాదంగా పరిగణించే అవకాశమే ఎక్కువ. అలాంటి సందర్భాల్లో డబ్బు తిరిగి పొందడం లేదా పని పూర్తి చేయించాలని కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే మేస్ట్రీ ఉద్దేశపూర్వకంగా మోసం చేసి, అడ్వాన్స్ తీసుకుని మొదటి నుంచే పని చేయాలనే ఉద్దేశం లేకుండా వ్యవహరించినట్లు ఆధారాలు ఉంటే, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని మోసానికి సంబంధించిన నిబంధనల కింద క్రిమినల్ ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉండవచ్చు. దీనిపై పోలీసులు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారు.
న్యాయ నిపుణులు చెబుతున్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కోర్టుకు వెళ్లే ముందు మేస్ట్రీకి లేదా కాంట్రాక్టర్కు న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపించడం మంచిదని సూచిస్తున్నారు. నిర్దిష్ట గడువులో పని పూర్తి చేయాలని లేదా తీసుకున్న అడ్వాన్స్ను తిరిగి చెల్లించాలని అందులో పేర్కొనవచ్చు. చాలాసార్లు ఈ దశలోనే వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఇంటి నిర్మాణంలో వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే ప్రారంభం నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రాతపూర్వక ఒప్పందం చేసుకోవడం, చెల్లింపులను బ్యాంకు ద్వారా మాత్రమే చేయడం, పనుల పురోగతికి అనుగుణంగా విడతల వారీగా డబ్బు చెల్లించడం, బిల్లులు, రసీదులు, మెసేజ్లు, ఫొటోలు వంటి ఆధారాలను భద్రంగా ఉంచుకోవడం మంచిది.