Headlines

‘ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో ఏకంగా Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో కొలువు’ రాయలసీమ బిడ్డ సక్సెస్ స్టోరీ


శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులు లక్ష్మయ్య, సుగుణ. పెద్దగా చదువుకోని తల్లిదండ్రులు.. కష్టపడి పనిచేయడం, నిజాయితీగా జీవించడం వంటి విలువలను మాత్రం కొడుకుకు నేర్పించారు. చిన్నతనంలో సెలవులు వస్తే తండ్రితో కలిసి పొలానికి వెళ్లి వ్యవసాయ పనుల్లో సాయం చేయడం శ్రావణ్‌కు అలవాటే. చదువు విషయంలోనూ అతని ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివినప్పటికీ పాఠాలు ఎక్కువగా తెలుగులోనే బోధించేవారు. దీంతో ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్‌తో అతని పరిచయం పుస్తకాల్లోని అక్షరాలకే పరిమితమైంది. చుట్టుపక్కల ఇంగ్లిష్ మాట్లాడే వాతావరణం కూడా లేదు. అయితే అదే భాషను తర్వాత పట్టుదలతో నేర్చుకున్నాడు. తనకు బలహీనంగా ఉన్న విషయాన్ని వదిలేయకుండా.. దానినే బలంగా మార్చుకున్నాడు.

టైర్ 2 కాలేజీ నుంచి టెక్ ప్రపంచంలోకి..

ఇంజినీరింగ్ కోసం ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రముఖ సంస్థల్లో కాకుండా సాధారణ టైర్-2 కాలేజీలో చేరాడు. బీటెక్‌లో మూడో సంవత్సరం వరకు అతని జీవితం కూడా చాలామంది విద్యార్థుల్లాగే సాగింది. చదువు, స్నేహితులు, సినిమాలు, ఆటపాటలు.. ఇదే ప్రపంచం. కానీ మూడో సంవత్సరం సమయంలో అతని ఆలోచనా విధానంలో కీలకమైన మార్పు వచ్చింది. ‘కాలేజీలో నేర్చుకుంటున్న చదువు.. రేపు ఉద్యోగంలో, వాస్తవ ప్రపంచంలో నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? కంపెనీలు అసలు ఏం కోరుకుంటున్నాయి? అందుకు నేను ఎలా సిద్ధం కావాలి?’ అనే ప్రశ్నలు అతడిని వెంటాడాయి. ఆ ప్రశ్నలకు సమాధానం కోసం ఎవరిపైనో ఆధారపడకుండా తనను తాను తీర్చిదిద్దుకోవడం ప్రారంభించాడు.

బయట కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగకుండా యూట్యూబ్, ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించుకుని కోడింగ్ నేర్చుకున్నాడు. అతని విద్యా నేపథ్యం ఎలక్ట్రానిక్స్ అయినప్పటికీ సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. తనకు తెలియని విషయం ఏదైనా ఎదురైతే.. దాన్ని వదిలేయకుండా వెతికి తెలుసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. నిరంతరం నేర్చుకోవడం వల్ల ఇంజినీరింగ్ పూర్తయ్యే సమయానికి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. చాలామంది ఉద్యోగం వచ్చాక తమ లక్ష్యాన్ని అక్కడితో ముగిస్తారు. కానీ శ్రావణ్ మాత్రం అలా చేయలేదు. ఉద్యోగం చేస్తూనే కొత్త టెక్నాలజీలపై దృష్టి పెట్టాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలను నేర్చుకున్నాడు. అయినా అతనికి ఇంకా ఏదో సాధించాల్సి ఉందనే భావన కలిగింది. ప్రస్తుత ఉద్యోగం తన అంతిమ లక్ష్యం కాదని గ్రహించి, మరింత నేర్చుకోవాలనే ఉద్దేశంతో 2022 ఆగస్టులో అమెరికా వెళ్లాడు.

ఇవి కూడా చదవండి



అమెరికాలో చదువు.. చివరకు Googleలో ఉద్యోగం

అమెరికాలో మాస్టర్స్ చదువుతూనే విద్యతో పాటు నాయకత్వ నైపుణ్యాలను కూడా పెంచుకున్నాడు. యూనివర్సిటీలోని ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. చదువు, నాయకత్వం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాడు. మాస్టర్స్ పూర్తయిన తర్వాత అమెరికాలోనే మరో మంచి ఉద్యోగం సాధించాడు. అయితే తనను తాను మెరుగుపరుచుకునే ప్రయత్నాన్ని మాత్రం కొనసాగించాడు. నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంచుకోవడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం చివరకు అతడిని ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన Google గడప వరకు తీసుకెళ్లాయి. గత ఏడాది గూగుల్‌లో ఉద్యోగం సాధించిన శ్రావణ్ ప్రస్తుతం నెట్‌వర్కింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతడి వార్షిక ప్యాకేజీ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని అందుబాటులో ఉన్న వివరాలు పేర్కొంటున్నాయి. గూగుల్‌లో ఉద్యోగం, భారీ ప్యాకేజీ సాధించినప్పటికీ శ్రావణ్ లక్ష్యం కేవలం వ్యక్తిగత ఎదుగుదలతో ముగియడం లేదు. భవిష్యత్తులో భారత్‌కు తిరిగి వచ్చి వివిధ రంగాల్లో కంపెనీలు స్థాపించాలని ఆయన భావిస్తున్నారు. టెక్నాలజీ రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ వ్యాపారాలను ప్రారంభించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఆయన లక్ష్యం. దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.

రాజంపేటలోని రైతు కుటుంబం నుంచి అమెరికాలోని గూగుల్ వరకు శ్రావణ్ కుమార్ ప్రయాణం ఒక్క రోజులో సాధ్యమైన విజయం కాదు. ఇంగ్లిష్‌పై ఉన్న భయాన్ని అధిగమించడం నుంచి కొత్త టెక్నాలజీలను స్వయంగా నేర్చుకోవడం వరకు ప్రతి దశలోనూ తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగాడు. ప్రముఖ కాలేజీలో చదవకపోవడం, ప్రారంభంలో ఇంగ్లిష్‌పై పట్టు లేకపోవడం.. ఇవేవీ తన లక్ష్యానికి అడ్డంకులు కావని నిరూపించిన శ్రావణ్ ప్రయాణం, నేర్చుకోవాలనే తపన ఉంటే అవకాశాలను మనమే సృష్టించుకోవచ్చని చెబుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *