
రాజ్ శమాని పాడ్కాస్ట్లో పాల్గొన్న స్టార్ కిడ్ జాన్వీ కపూర్, తన దగ్గర వారు ఎదుర్కొన్న మద్యం వ్యసనం తనను ఎంతలా కలచివేసిందో వివరించింది. తాను కేవలం ఈ వ్యసనంతో బాధపడేవారికి సహాయం చేసే ఒక ‘కేర్గివర్’ (సంరక్షకురాలు), మిత్రురాలిగా మాత్రమే ఈ చర్చలో భాగమయ్యానని స్పష్టం చేసింది. ఆమె మద్యం అలవాటుపై అసలు ఏం చెప్పిందో తెలుసుకుందాం.
నా మాటలను వక్రీకరించారు
గతంలో మద్యం అలవాటు గురించి జాన్వీ మాట్లాడిన మాటలను కొన్ని మీడియా సంస్థలు క్లిక్బైట్ కోసం తప్పుగా ప్రచారం చేశాయి. దీనిపై ఆమె భాగస్వామ్యం ఉన్న ‘అమహా’ (Amaha) అనే మానసిక ఆరోగ్య సంస్థ అధికారికంగా స్పందించింది. “ఆమె కేవలం ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండే ఒక కేర్గివర్గా మాత్రమే ఈ చర్చలో పాల్గొంది. అంతేగానీ ఆమెకు ఎలాంటి వ్యక్తిగత వ్యసనం లేదా ఆల్కహాల్పై ఆధారపడే అలవాటు లేదు” అని ఆ సంస్థ చాలా స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వ్యసనంతో పోరాడుతున్న వారి అనుభవాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని జాన్వీ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకుంటూ తప్పుడు వార్తలకు చెక్ పెట్టింది.
ఆ చేదు అనుభవం ఏమిటంటే..
పాడ్కాస్ట్లో తన మద్యం అలవాటుపై మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ ఎక్కువగా మద్యం తాగేదాన్ని కాదు. రెండు మూడు నెలలకు ఒకసారి మాత్రమే తీసుకునేదాన్ని. కానీ కరోనా సమయంలో నా జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన తర్వాత దాదాపు ఏడాది పాటు తరచుగా మద్యం సేవించాను. అయితే దానికి నేను బానిసను కాలేదు” అని జాన్వీ వివరించింది. ఆ సమయంలో తనకు మద్యం తాగాలనే కోరిక విపరీతంగా ఉండేదని, కానీ ఆ అలవాటు వల్ల తన శరీరంపై పడుతున్న ప్రభావాన్ని తాను ఇష్టపడలేదని పేర్కొంది. మరుసటి రోజు ఉదయం లేచినప్పుడు వచ్చే హ్యాంగోవర్ తనకు తీవ్రమైన చికాకును కలిగించేదని చెప్పింది.
ఆల్కహాల్కు దూరం
మద్యం ఎక్కువగా సేవించిన ఒక రోజు తన శరీరం నుండి వస్తున్న వాసన.. గతంలో మద్యం వ్యసనంతో పోరాడిన తన కుటుంబ సభ్యుల నుండి వచ్చిన వాసనలాగే ఉందని ఆమె గమనించింది. ఆ వాసనను పీల్చినప్పుడు ‘ఈ రోజు మంచి రోజు కాదు’ అనే భావన తనలో కలిగేదని భావోద్వేగానికి లోనైంది. ఆ చేదు అనుభవం తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ఆమె ఆల్కహాల్కు పూర్తిగా దూరంగా ఉంది. ప్రస్తుతం ఆ అలవాటుపై తనకు పూర్తి నియంత్రణ ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మద్యం వ్యసనంతో బాధపడేవారికి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన మానసిక సహాయం, వనరులను అందించడానికి బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో పనిచేస్తున్న ‘అమహా’ సంస్థతో చేతులు కలిపినట్లు జాన్వీ కపూర్ వెల్లడించింది.