రేపల్లె సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీముడు అజిత్ కుమార్ పరారీ ఉదంతం ఇప్పుడు పోలీసు శాఖలో సంచలనంగా మారింది. అనారోగ్యం నెపంతో జైలు నుంచి బయటకు వచ్చి, పక్కా ప్లాన్తో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ఈ “టెక్” ఖైదీ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అజిత్ కుమార్ ఆన్లైన్ మోసాల్లో ఆరితేరిన నేరగాడు. తెనాలిలో నమోదైన కేసులో ఇతను రేపల్లె జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మార్చి 27న తనకు ఒంట్లో బాగోలేదని జైలర్ మన్నెం వెంకటేశ్వరావుకు చెప్పడంతో, ఎస్కార్ట్తో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే, ఈ ఆసుపత్రి ప్రయాణం వెనుక పెద్ద కథే నడిచింది. తమిళనాడులోని తిరువళ్లూరులో ఉంటున్న అజిత్ సోదరి ఫోన్ పే ఖాతా నుంచి జైలర్ వెంకటేశ్వరావుకు ఫోన్ పే ఖాతాకు రూ. 60,000అందినట్లు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. ఈ డబ్బు అందిన తర్వాతే అజిత్ను ఆసుపత్రికి పంపేలా జైలర్ చక్రం తిప్పాడని గుర్తించారు.
మార్చి 28న జీజీహెచ్లో ఉన్న అజిత్, తన వద్ద ఉన్న ఎస్కార్ట్ కానిస్టేబుల్కు రూ. 500** ఇచ్చి, “నువ్వు వెళ్లి టిఫిన్ చేసి, నాకు కూడా తీసుకురా” అని నమ్మబలికాడు. కానిస్టేబుల్ టిఫిన్ చేసే పనిలో ఉండగా, వాష్ రూమ్కు వెళ్తానని చెప్పిన అజిత్, అక్కడి నుంచి నేరుగా బయటకు వచ్చి ఆటో ఎక్కి మాయమయ్యాడు. ఆటో ఎక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఖైదీ పరారీ వెనుక సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు అవినీతి కూడా ఉందని నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. లంచం తీసుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో జైలర్ మన్నెం వెంకటేశ్వరావును సస్పెండ్ చేశారు. ఎస్కార్ట్ పోలీసుల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది, త్వరలోనే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సాంకేతికతను వాడటంలో అజిత్ కుమార్ దిట్ట. ఫోన్లు వాడకపోవడం, తరచూ స్థావరాలు మారుస్తుండటంతో 20 రోజులు గడిచినా అతని ఆచూకీ లభ్యం కావడం లేదు. ప్రస్తుతం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని, అధికారులనే ప్రలోభపెట్టి ఖైదీ పారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..