Headlines

‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!

‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!


‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టలేదనే కారణంతో కన్న తండ్రే తన 13 గంటల నవజాత ఆడశిశువును గొంతు నులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిపై ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆడబిడ్డలపై ఇంకా కొనసాగుతున్న వివక్షను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలోని బిచ్‌పాడి గ్రామానికి చెందిన 34 ఏళ్ల రవి కుమార్ యాదవ్‌గా గుర్తించారు. నీమ్రానాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రవి కుమార్ యాదవ్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. జూలై 27న తన భార్య కోమల్‌ను ప్రసవం కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, జూలై 28న సిజేరియన్ ద్వారా ఆడబిడ్డ జన్మించింది. ఈ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉండగా, మూడో సంతానం కూడా ఆడపిల్లే కావడంతో రవి తీవ్ర నిరాశకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

ప్రసవం అనంతరం తల్లిని ఐసీయూలో ఉంచడంతో అర్ధరాత్రి సమయంలో నవజాత శిశువును సంరక్షణ కోసం తండ్రి వద్ద ఉంచారు. తెల్లవారుజామున వరకు పాప ఏడుస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఏడుపు ఆగిపోవడంతో నర్సింగ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే శిశువును పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ ప్రారంభమైంది. పోలీసుల విచారణలో రవి కుమార్ యాదవ్ తన కుమార్తెను గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. నర్సింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్వాజీ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ ఘటనతో నిమ్స్ ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. నవజాత శిశువుల వార్డులో తగిన నిఘా ఉందా, శిశువును పూర్తిగా తండ్రి సంరక్షణలో ఎందుకు ఉంచాల్సి వచ్చిందనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు కారణమవుతోంది. ఆడబిడ్డలపై వివక్ష ఇంకా సమాజంలో కొనసాగుతుండటంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *