ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో మానవత్వం సిగ్గుపడేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశాడన్న అనుమానంతో ఒక యువకుడిని గ్రామస్తులు అమానుషంగా హింసించి, వీధుల్లో ఊరేగించిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. రామానుజ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాస్తా గ్రామంలో ఈ అమానుషం చోటుచేసుకుంది.
కళ్యాణ్పూర్కు చెందిన మహమ్మద్ రెహమాన్ తాజ్ (32) అనే వ్యక్తి, గ్రామంలోని సోలార్ ప్యానెల్ వైర్లను దొంగిలించాడనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయమై చర్చించేందుకు పంచాయతీ పెద్దలు అతడిని పిలిపించగా, తన భార్యతో కలిసి అతను గ్రామానికి చేరుకున్నాడు. రాజీ చర్చల పేరుతో పిలిపించిన గ్రామస్థులు, ఒక్కసారిగా రెహమాన్పై దాడికి దిగారు. అదే సమయంలో, కొంతమంది గ్రామస్తులు అతడిని పట్టుకున్నారు. యువకుడిని మొదట తీవ్రంగా కొట్టి, ఆపై అతని తలకు సగం గుండు కొట్టి, చెప్పులు, బూట్ల దండ వేసి, అర్ధనగ్నంగా గ్రామం గుండా ఊరేగించారు. బాధితుడి భార్యపై నిందితులు దాడికి తెగబడ్డారు. నపై దాడి చేసి, అత్యాచారం చేసి, చంపేస్తామని బెదిరించారని ఆమె ఆరోపిస్తోంది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు ఆరోపణలతో తన కుమారుడిని వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులకు అప్పగించాలి కానీ, ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడటం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. దోషులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. గ్రామస్థుల ఆగ్రహమే దొంగతనం ఘటనకు దారితీసిందని సర్పంచ్ భర్త చెబుతున్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..