2029లో జరగబోయే ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పర్చూరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 2.0పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పాదయాత్ర 2.0 ఉంటుందన్నారు.
వచ్చే ఏడాది అంటే 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పాదయాత్రం 2.0ను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోతున్నట్టు ఆయన పర్చూరు నియోజకవర్గ నేతల సమావేశంలో ప్రకటించారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించే వ్యూహంలో భాగంగా ఈ యాత్ర రూపకల్పన ఉంటుందన్నారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసిపట్టి, ఎన్నికల మూడ్ను పార్టీకి అనుకూలంగా మార్చనున్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, పరిపాలనా లోపాలను ఎండగడుతూనే, తమ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తుచేయడం ప్రధాన ఎజెండాగా పాదయాత్రను సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పాదయాత్రతో ఓటమితో నిరాశలో ఉన్న కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. గతంలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు వచ్చిన పాజీటీవ్ రెస్పాన్స్నే మళ్లీ తీసుకురావాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.