తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులను డిపోల్లోనే ఉంచి కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో బస్సు సౌకర్యం లేక రాష్ట్రంలోని ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే కార్మికుల సమ్మె క్రమంలో ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. కొన్నిచోట్ల అద్దె బస్సులను కూడా తిప్పుతున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య బస్సులను అధికారులు నడుపుతున్నారు. అయితే కండక్టర్లు అందుబాటులో లేకపోవడంతో డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తారు. ప్రయాణికులు డ్రైవర్ దగ్గరికి వెళ్లి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
టికెట్లు తీసుకోని పురుషులు
అయితే కండక్టర్లు లేకపోవడం వల్ల పురుషులు టికెట్లు తీసుకోవడం లేదు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండగా.. పురుషులు టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కండక్టర్లు లేకపోవడం వల్ల పురుషులు డ్రైవర్ల దగ్గరికి వెళ్లి టికెట్లు తీసుకోవడం లేదు. దీంతో పురుషులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. “తెలంగాణ గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు లైఫ్ లైన్ ఆర్టీసీ.. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ప్రజా శ్రేయస్సు కారణంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నా.. ఆర్టీసీలో రోజుకు 65 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది మిగిలిన మూడు అంశాలపై చర్చిస్తున్నాం.. మేము రాగానే వేసిన మొట్ట మొదటి కమిటీ సీనియర్ ఐఏఏస్ లతో వేశాం.. అధికారుల కమిటీతో ఐదు గంటలపైగా చర్చిస్తుండగానే సమ్మెకు పోతున్నామని మధ్యలో వెళ్లిపోవడం ఇది కుట్రలో భాగమే” అని పొన్నం అన్నారు.
పొన్నం విమర్శలు
“ఇటీవల జగిత్యాల సభలో మహాలక్ష్మీ ప్రయాణం గురించి కేసీఆర్ అవహేళనగా మాట్లాడారు. వెంటనే ఆర్టీసీపై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా ఉన్న హరీష్ రావు సమ్మెపై కార్మికులను ప్రోత్సహించారు. మహాలక్ష్మీ పథకాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరు. ఆర్టీసీ డిమాండ్స్పై చర్చిస్తున్నామని అధికారులు చెప్పారు.. అయిన వినకూడనే ఎవరితో ఫోన్లో మాట్లాడి సమ్మెకి వెళ్ళారు. ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం..1134 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చాం. రాష్ట్ర రవాణా శాఖ పక్షాన పని భారం లేకుండా కార్మిక చట్టాలు లోపలే చేశాం. గతంలో 12 గంటలు వాహనం నడపడం వల్ల మరునాడు హాఫ్ ఉండేది.. వాళ్ళు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.మేమే పని భారం లేకుండా చేయాలని చూస్తున్నాం. మేము శ్రమ దోపిడి చేయదలచుకోలేదు విలీనం ,యూనియన్ ల అంశాలపై ప్రభుత్వం పరిగణనలో ఉంది ప్రభుత్వం నెలకి ఆర్టీసీకి 300 కోట్లు, అవసరమైనప్పుడు 400 కోట్లు ఎంత అవసరం ఉంటే అంత ఇస్తుంది. ఆర్టీసీలో సర్వీసు నుండి రిమూవ్ అయిన వారికి 250 మందికిపైగా ఉద్యోగాలు ఇస్తున్నాం” అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.