యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్గా ద్వారం కేశవరెడ్డి ఏడాదిన్నర కాలంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కేశవరెడ్డి విధుల పట్ల ఎప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వివిధ ఖాతాల్లో ప్రజలు, రైతులు జమ చేసుకున్న రూ.2.30 లక్షల నగదును కాజేశాడు. దీంతో గ్రామ రైతులు పలుమార్లు కేశవరెడ్డిని తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అయినా కేశవరెడ్డి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వారంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సిద్దమయ్యారు.
అయితే ఈ విషయం మోత్కూర్లో ఉంటున్న కేశవరెడ్డి తండ్రి కొండల్ రెడ్డికి తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా ఆయన వెంటనే పాటిమట్ల గ్రామానికి చేరుకొని తన కుమారుడు కాజేసిన డబ్బును తపాలా శాఖలో జమ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కేశవరెడ్డి బాధితుల సమక్షంలో తన తండ్రి కొండల్ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన బాధితులు మళ్లీ పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తన కొడుకు చేసింది పొరపాటేనని.. అతడిని క్షమించాలని తండ్రి కొండల్ రెడ్డి బాధితులను వేడుకున్నాడు. దీందో బాధితులంతా శాంతించారు.
ఈ ఘటనపై మోత్కూరు సబ్ పోస్టుమాస్టర్ (ఎస్పీఎం) రచ్చ రమేష్ దృష్టికి వెళ్లడంతో ఘటనపై స్పందించిన ఆయన పాటిమట్ల బీపీఎం కేశవరెడ్డి రూ.2.30 లక్షలు స్వాహా చేసిన విషయం వాస్తవమేనని, ఆ డబ్బును ఆయన తండ్రి పోస్టాఫీస్ లో జమ చేశాడని చెప్పారు. బాధితుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎస్పీఎం చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.