Team India: సూర్యకుమార్ పోస్ట్ పీకేశారుగా.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఆ తోపుగాడు..?

Team India: సూర్యకుమార్ పోస్ట్ పీకేశారుగా.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఆ తోపుగాడు..?


ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయి తడబడుతుండటం భారత క్రికెట్ నియంత్రణ మండలిని ఆలోచనలో పడేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, సూర్యకుమార్ స్థానంలో మరొక సమర్థవంతమైన నాయకుడి కోసం వెతుకుతున్న సెలెక్టర్లకు శ్రేయస్ అయ్యర్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. కేవలం ఆటగాడిగానే కాకుండా, జట్టును నడిపించే వ్యూహకర్తగా అయ్యర్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ అతడిని ఈ రేసులో ముందుంచింది.

ఐపీఎల్‌లో అజేయమైన రికార్డు..

శ్రేయస్ అయ్యర్ పేరు ప్రధానంగా వినిపించడానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని అద్భుతమైన కెప్టెన్సీ గణాంకాలు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకులలో అయ్యర్ ఒకడిగా నిలిచాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్‌కు చేర్చడమే కాకుండా, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన ఘనత అతనిది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అయ్యర్, గెలుపు శాతంలో దిగ్గజాలు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలను సైతం అధిగమించడం విశేషం. కెప్టెన్‌గా 61 శాతం విజయాలతో దూసుకుపోతున్న అయ్యర్ గణాంకాలు సెలెక్టర్లను అమితంగా ఆకర్షించాయి.

సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం, ప్రత్యామ్నాయాలు..

సూర్యకుమార్ యాదవ్ వరుస మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం జట్టుకు భారంగా మారుతోంది. మరోవైపు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, వారి నాయకత్వ సామర్థ్యంపై పూర్తిస్థాయి ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇలాంటి తరుణంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ జట్టును ఇబ్బందుల నుంచి గట్టెక్కించగల, అనుభవజ్ఞుడైన అయ్యర్ వైపు మొగ్గు చూపడం సహజమని విశ్లేషకులు భావిస్తున్నారు.

సవాలుతో కూడుకున్న నిర్ణయం..

అయితే శ్రేయస్ అయ్యర్‌ను నేరుగా కెప్టెన్‌గా నియమించడం అంత సులభం కాదు. ఆయన 2023లో తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం టీ20 జట్టులో సభ్యుడు కూడా కాదు. దాదాపు మూడేళ్లుగా ఈ ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో దూరంగా ఉన్న ఆటగాడిని నేరుగా తీసుకొచ్చి పగ్గాలు అప్పగించడం ఒక సాహసోపేతమైన నిర్ణయమే అవుతుంది. సెలెక్టర్లు ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉంటే, భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా అయ్యర్‌ను తిరిగి జట్టులోకి తీసుకువచ్చి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

ఈ మార్పు జరిగితే భారత టీ20 క్రికెట్‌లో కొత్త శకం మొదలవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. రాబోయే సిరీస్‌ల కోసం జట్టు ఎంపిక సమయంలో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *