Vaibhav Sooryavanshi Team India Debut: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారు. జూన్ నెలలో జరిగే ఐర్లాండ్ పర్యటన కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ వైభవ్ పేరును షార్ట్లిస్ట్ చేసినట్లు సమాచారం. ఈ పర్యటనలో యువ ఆటగాళ్లతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు నిర్ణయించింది. వైభవ్ ఒకవేళ బరిలోకి దిగితే, అతి చిన్న వయస్సులో భారత్ తరపున ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు.
సచిన్, షఫాలీ రికార్డులు ప్రమాదంలో..
ప్రస్తుతం పురుషుల క్రికెట్లో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయస్సులో అరంగేట్రం చేసి రికార్డులో ఉండగా, మహిళల క్రికెట్లో షఫాలీ వర్మ (15 ఏళ్ల 7 నెలలు) అత్యంత పిన్న వయస్కురాలిగా ఉంది. వైభవ్ వయస్సు ప్రస్తుతం కేవలం 15 ఏళ్లు మాత్రమే. దీంతో ఐర్లాండ్ సిరీస్లో ఇతను బరిలోకి దిగితే సచిన్ రికార్డు కనుమరుగు కావడం ఖాయం. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా వైభవ్ ప్రతిభను కొనియాడుతూ, అతను ఈ అరుదైన రికార్డుకు అర్హుడని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఐపీఎల్ 2026లో విధ్వంసంఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచింది. బెంగళూరుపై 26 బంతుల్లో 78 పరుగులు, చెన్నైపై 17 బంతుల్లో 52 పరుగులు, ముంబైపై 14 బంతుల్లో 39 పరుగులు చేసి తన సత్తా చాటాడు. జస్ప్రీత్ బుమ్రా వంటి మేటి బౌలర్లను సైతం ఎదుర్కొంటున్న తీరు చూస్తుంటే, అతను అంతర్జాతీయ స్థాయికి సిద్ధంగా ఉన్నాడని ఇర్ఫాన్ పఠాన్, అనిల్ కుంబ్లే వంటి మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
భవిష్యత్తు ప్రణాళికలు..
ఐర్లాండ్ సిరీస్ తర్వాత జింబాబ్వే పర్యటనకు కూడా వైభవ్ ఎంపికయ్యే అవకాశం ఉంది. జులైలో జరిగే ఇంగ్లాండ్ సిరీస్ నాటికి సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నందున, ఈ లోపు యువ సంచలనాన్ని పరీక్షించాలని బోర్డు భావిస్తోంది. వైభవ్ రాకతో భారత బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..