Revanth Reddy: నేషనల్ పాలిటిక్స్‌లో ‘రేవంత్ మార్క్’.. వ్యూహకర్తగా మారిన తెలంగాణ సీఎం!

Revanth Reddy: నేషనల్ పాలిటిక్స్‌లో ‘రేవంత్ మార్క్’.. వ్యూహకర్తగా మారిన తెలంగాణ సీఎం!


తెలంగాణ రాజకీయ యవనికపై ఉవ్వెత్తున ఎగసిన కెరటం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ కెరటం కేవలం గండిపేట పరిధిలోనే ఆగకుండా, యమునా తీరం వరకు తన ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక ‘నేషనల్ బ్రాండ్’గా అవతరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర నాయకుడు కాదు.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ దిశను నిర్దేశించే వ్యూహకర్తగా అవతరిస్తున్నారు. ఆయన అడుగులు, ఆయన వ్యాఖ్యలు, ఆయన ప్రతిపాదనలు ఇవన్నీ ఇప్పుడు నేరుగా జాతీయ రాజకీయ చర్చను ప్రభావితం చేస్తున్నాయి. గత రెండేళ్లలో ఆయన ప్రదర్శించిన దూకుడు, వాక్చాతుర్యం, ఆలోచనలో స్పష్టత, నాయకత్వ శైలి, రాజకీయ టైమింగ్ అన్నీ కలిసి అయ్యి ఆయనను కాంగ్రెస్‌లో మాస్టర్ మైండ్‌గా నిలబెట్టాయి.

కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఢిల్లీ నుంచి ఆదేశాలు రాష్ట్రాలకు అందుతాయి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఒక ఆలోచన, ఒక నినాదం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేస్తోంది. ఆ మార్పుకు కేరాఫ్ అడ్రస్ అనుముల రేవంత్ రెడ్డి. కేవలం తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాకుండా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)కి ఒక శక్తివంతమైన వ్యూహకర్తగా, అజెండా సెట్టర్‌గా ఆయన ఎదుగుతున్న తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రాజకీయాల్లో ప్రత్యర్థి వేసే ఎత్తులకు సమాధానం చెప్పడం ఒక ఎత్తు అయితే, ప్రత్యర్థి తన అజెండాపై మాట్లాడేలా చేయడం మరో ఎత్తు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సరిగ్గా ఇదే చేశారు. భారతీయ జనతా పార్టీ 400 సీట్ల నినాదం వెనుక రాజ్యాంగ మార్పు కుట్ర ఉందనే అంశాన్ని ఆయన బలంగా తెరపైకి తెచ్చారు. ఈ ఒక్క పాయింట్ దేశవ్యాప్త చర్చకు దారితీసింది, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిస్పందన రాజకీయాల నుంచి ప్రతిఘటన రాజకీయాలకు కాంగ్రెస్‌ను మళ్లించడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారు.

విపక్షాల ఐక్యతలో రేవంత్ రెడ్డి పాత్ర కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించి, విభిన్న భావజాలం ఉన్న విపక్ష నేతలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ ఆయన డిప్లొమాటిక్ స్కిల్స్‌కు నిదర్శనం. ఇది ఆయనకు జాతీయ స్థాయి నేతలతో ఉన్న సత్సంబంధాలను, సమన్వయ కర్తగా ఆయనకున్న సామర్థ్యాన్ని చాటిచెప్పింది.

తాజాగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశం ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించే ప్రమాదం ఉంది. ఇలాంటి సున్నితమైన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ మోడల్’ పార్టీ హైకమాండ్‌ను అమితంగా ఆకట్టుకుంది. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికి అన్యాయం జరగకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా సీట్ల కేటాయింపు ఎలా ఉండాలనే దానిపై ఆయన ఇచ్చిన క్లారిటీ, ఆయనలోని థింక్ ట్యాంక్‌ను బయటపెట్టింది.

రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేల తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో అత్యంత క్రేజ్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కేరళ నుంచి మహారాష్ట్ర వరకు ఆయన సభలకు వస్తున్న స్పందన చూస్తుంటే, ఆయన ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ నేత కాదు. స్థానిక సమస్యలను జాతీయ అంశాలతో ముడిపెట్టి, సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పే ఆయన వాక్చాతుర్యం పార్టీకి పెద్ద ఆస్తిగా మారింది.

రాజ్యాంగ పరిరక్షణ, ఫెడరలిజం, సామాజిక న్యాయం అనే మూడు స్తంభాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ నేరేటివ్‌ను నిర్మిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటారో, హైకమాండ్ గదుల్లో వ్యూహాల రచనలో అంతే నిశ్శబ్దంగా తన పని పూర్తి చేస్తారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక దక్షిణాది ముఖ్యమంత్రి, ఏఐసీసీ విధాన నిర్ణయాల్లో ఇంతటి కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఒకప్పుడు ఢిల్లీ కనుసన్నల్లో నడిచే నాయకులు ఉండేవారు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు. రేవంత్ రెడ్డి అనే బ్రాండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకం, ప్రత్యర్థులకు ఒక సవాల్!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *