Headlines

Rain Updates: బంగాళాఖాతంలో ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

Rain Updates: బంగాళాఖాతంలో ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త


తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటివరకు ఎండలతో ప్రజలు అల్లాడిపోగా.. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తొలకరి పలకరించినా, నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఎల్‌నివో ప్రభావం వల్ల వర్షాలు అనుకున్నంతగా కురవలేదు. గతంలో పోలిస్తే లోటు వర్షపాతం భారీగా నమోదైంది. పలు జిల్లాల్లో ఎల్‌నివో ప్రభావం మరింతగా ఉంటుందని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. నేటి వెదర్ రిపోర్ట్ విషయానికొస్తే..  తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు వర్షసూచన జారీ చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

జులై 24వ తేదీన ఏపీలోని పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం వర్షసూచన జారీ చేసింది. చిత్తూరు, కాకినాడ, పోలవరం, ఎన్టీఆర్, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఇక విశాఖపట్నం, పల్నాడు, బాపట్ల, మర్కాపురం, నంద్యాల, ప్రకాశం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని, వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాల్లో ఉండవద్దని తెలిపింది. రైతులు, కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక వర్షాలు పడే సమయంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఉండవద్దని సూచనలు చేసింది. వానలు పడేటప్పుడు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు

ఇక జైసల్మేర్‌, కోట, గుణ, దామోహ్‌, డాల్టన్‌గంజ్‌, కాంటాయ్‌ మీదుగా ఆగ్నేయ దిశగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని స్పష్టం చేసింది. జులై 26 తర్వాత రాష్ట్రంతో వర్షాల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. రాష్ట్రంలో లోటు వర్షపాతం కొనసాగుతోందని, గతంతో పోలిస్తే 25 శాతం తక్కవగా ఉందని పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధికంగా లోటు వర్షపాతం 60 శాతంగా ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *